ఓయు ఉత్సవాలు: కెసిఆర్కు అది అవమానమే!
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ ఉంటూ వచ్చింది. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో కెసిఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం 25 నిమిషాలు మాట్లాడారు.
కెసిఆర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాహిత్యం చదివారు. ఉస్మానియాలో చదివినవారంతా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక రకమైన ఉద్వేగానికి గురయ్యారు. విశ్వవిద్యాలయంతో తమ అనుబంధాన్ని నెమరేసుకున్నారు. మీడియా కూడా దానికి ఎక్కువే ప్రాధాన్యం ఇచ్చింది.
ఉస్మానియాలో చదివి ప్రముఖ స్థానాలను పొందినవారి అనుభవాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఉస్మానియాతో తనకు గల అనుబంధాన్ని ఉద్వేగపూరితంగా పంచుకుంటారని భావించారు. కానీ, అది జరగలేదు. ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
కెసిఆర్కు అవమానమే...
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో తాను ప్రసంగించాల్సిన వాతావరణం లేకపోవడం, తాను మాట్లాడకుండానే వెళ్లిపోవడం కెసిఆర్కు అవమానమేనని చెప్పవచ్చు. ఎంతో ప్రాముఖ్యం, విశిష్టత కలిగిన ఆ కార్యక్రమం ఆయనకు అత్యంత విలువైంది. అందువల్ల దాన్ని అవమానంగానే భావించాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఆగ్రహం
ఉస్మానియా విశ్వవిద్యాలయ సమస్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతారని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సీఎం ప్రసంగించకుండానే వెను తిరిగారు. అటు గవర్నర్ నరసింహన్ కూడా మౌనంగా వెళ్లిపోయారు. రాష్ట్రపతి సభ నుంచి బయటకు వెళ్లగానే విద్యార్ధులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్ధులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేయడంతో ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వాస్తవానికి కార్యక్రమం ఇదీ..
వాస్తవానికి ప్రారంభ సభలో రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే గవర్నర్ నరసింహన్, సీఎం కేసిఆర్ ప్రసంగాలు ఉండే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. కానీ విద్యార్థులు నిలదీసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే, వారు ప్రసంగించకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది.
జీవన్ రెడ్డి ఇలా..
ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఓయూ విద్యార్థుల త్యాగాలను స్మరించుకోవాల్సిన సమయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెసు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఏదీఏమైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓయూకు వెళ్లిన సీఎం కేసీఆర్ మాట్లాడకుండానే వెనుతిరగడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలోనూ..
ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సికింద్రాబాదులో ఎన్నికల ప్రచారం సందర్భంగాలో తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని మైదానంలో దింపి, అక్కడి నుంచి ఎన్నికల సభకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, విద్యార్థులు గో బ్యాక్ అని నినాదాలు చేయడంతో అక్కడ దిగకుండానే వెనక్కి వెళ్లారు.
ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనా...
కెసిఆర్ ప్రసంగిస్తే విద్యార్థులు అడ్డు తగిలి ప్రశ్నలు వేస్తారనే సమాచారంతోనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. అయితే, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో కెసిఆర్ ఉన్నారా అనేది కూడా సందేహమే. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లలో ఏవి సరైనవి, ఏవి కావనే విషయాలను కెసిఆర్ చెప్పి ఒప్పించలేకపోయారా అనేది ప్రశ్న.