కేంద్రం తేల్చేసింది: చంద్రబాబుకు ఇక చుక్కలే
Recommended Video
న్యూఢిల్లీ: ఎంతగా మొరపెట్టుకున్నా, ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చేసి చెప్పింది. ఎప్పటికప్పుడు దిగి వస్తున్నట్లు నటిస్తూనే కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తోంది.
వచ్చే నెల 5వ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు చెప్పినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన జాతీయ సంస్థలపై, ప్రాజెక్టులపై, నిధులపై కేంద్రం 27 పేజీల నోట్ను విడుదల చేసింది.
కొత్తగా చెప్పిందేమీ లేదు...
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోట్లో కొత్తగా చెప్పిందేమీ లేదు. తాము ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ఇచ్చినవాటిని, ఇవ్వబోయే వాటిని వివరించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒత్తిడికి ఏ మాత్రం దిగిరాలేదని ఆర్థం చేసుకోవచ్చు.
ఈసారి వ్యూహాత్మకంగా హరిబాబు
నోట్ విడుదల చేసిన తర్వాత బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏమేం చేసిందనేది వివరించారు. నిజానికి హరిబాబు చంద్రబాాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. తాజాగా బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా చంద్రబాబుకు సన్నిహితుడైన హరిబాబును రంగంలోకి దింపినట్లు భావించాల్సి వస్తోంది.
విడతలు విడతలుగా జైట్లీ
ఆంధ్రప్రదేశ్ అంశాలపై పార్లమెంటులో విడతలు విడతలుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు ఏదో చెబుతారని ఆశతో ఎదురు చూసిన చంద్రబాబుకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. తాజాగా, వచ్చే నెల 5వ తేదీ లోపల అరుణ్ జైట్లీ ఏదో చెబుతారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు చెబుతున్నారు. కానీ కొత్తగా చెప్పేదేమీ లేదని తేల్చేశారు.
కేంద్రాన్ని నమ్మేది లేదు...
కేంద్ర ప్రభుత్వం మాటలను, హామీలను విశ్వసించేది లేదని తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, కేంద్రం చేతల్లో చూపాలని, కేంద్రం మాట తప్పితే మార్చి 5వ తేదీ నుంచి జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను స్తంభింపజేస్తాని ఆయన అన్నారు.
నమ్మించి మోసం చేసింది
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎపిని నమ్మించి మోసం చేసిందని కేశినేని నాని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నిర్ణయం మేరకు తమ వైఖరి ఉంటుందని చెప్పారు. మిత్రపక్షాలు కూడా బిజెపి తీరును, మోడీ వైఖరిని తప్పు పడుతున్నాయని అన్నారు. ఎపికి అన్యాయం జరిగిందని జాతీయ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయని, మద్దతు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు.