కర్నూలు రాజధాని: వెనుక జగన్ పార్టీ? (పిక్చర్స్)
కర్నూలు: కర్నూలును రాజధానిగా చేయాలనే డిమాండ్తో రాయలసీమలో ఆందోళనలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనల వెనక వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో రాజధాని ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిని గతంలో మాదిరి కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వేలాది మంది ప్రజలు సోమవారం ‘పొలి కేక' పెట్టారు. రాజధాని సాధన కోసం ఏర్పాటైన ఉద్యమ సంఘాలు, తెలుగుదేశం మినహా అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి లక్షలాది మంది ‘పొలి కేక' పేరిట కర్నూలులో ఆందోళన నిర్వహించాయి.
నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అటు, కడప పర్యటనకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీకి విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్కు తెలుగుదేశం మిత్రపక్షం బిజెపి రాయలసీమ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో చంద్రబాబుకు రాజధాని విషయం మరింత సమస్యగా మారే అవకాశం ఉంది.
పొలికేక కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య, పలు విద్యా సంస్థల అధినేతలు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
శివరామకృష్ణన్ కమిటీకి సెగ
శివరామకృష్ణన్ కమిటీ సభ్యులను కడప పర్యటనలో విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాయలసీమలోనే ఎపి రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు రాజధానిగా..
కర్నూలు పొలికేక బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడారు. కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలన్నది ప్రజల డిమాండ్ కాదని, ఇది తమ హక్కు అని ఆయన అన్నారు.
శ్రీబాగ్ ఒడంబడికే కావాలి
మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయిన అనంతరం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటైందని ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలుగువారంతా కలసి ఉండాలనే..
ఆ తర్వాత తెలుగువారంతా కలిసి ఉండాలన్న కారణంతో రాజధానిని హైదరాబాదుకు తరలించడానికి తాము అంగీకరించామని మోహన్ రెడ్డి తెలిపారు.
మళ్లీ అవతరించినందున..
తాజాగా తెలంగాణ విడిపోయి పాత ఆంధ్ర మళ్లీ అవతరించినందున నాటి ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాల్సిందేనని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉద్యమిస్తాం..
రాజధాని నగరాన్ని కర్నూలులో ఏర్పాటు చేయకుండా మరో ప్రాంతానికి తరలిస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిర్వహించక తప్పదని మోహన్ రెడ్డి హెచ్చరించారు.
బిజెపి మద్దతు కూడా..
రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రధాన సంస్థల్లో కొన్నింటిని ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేయవచ్చని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. రాజధానిగా మూడేళ్లు సేవలందించిన కర్నూలును ఈ సందర్భంగా విస్మరించకూడదన్నారు.
మోడీతో మాట్లాడుతాం..
తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ప్రధాని నరేంద్రమోడీని కలిసి కర్నూలులో రాజధాని ఏర్పాటు అంశాన్ని చర్చిస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నాీరు. .
విజ్ఝతతోనే ఇలా..
వెనుకబడిన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని, ఇతర ప్రధాన సంస్థలను మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని ఆలోచించి శ్రీబాగ్ ఒప్పందానికి వచ్చారని మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మిరెడ్డి అన్నారు.