రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు: అధికార, విపక్షాలపై సామాజిక కార్యకర్తల మండిపాటు
వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వెళుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీశాయి.
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వెళుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీశాయి. అందులో భాగంగా తొలుత బీహార్ గవర్నర్గా పని చేసిన రామ్నాథ్ కోవింద్.. అధికార ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్ వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చిన బీజేపీ.. విపక్షాలకు సవాల్ విసరాలని భావించింది. కాంగ్రెస్, వామపక్షాలు సహా 17 ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాత్మకంగానే లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశాయి.
ఆమె మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ తనయ కావడంతోపాటు ఆమె కూడా దళిత సామాజిక వర్గ నాయకురాలే. హస్తిన కేంద్రంగా అధికార, విపక్షాలుదళిత వర్సెస్ దళిత యుద్ధానికి ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు దళితకార్డును తమకు అనుకూలంగా మలచుకునేందుకు సాగిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలపై అట్టడుగు వర్గాల మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రామ్ నాథ్ అభ్యర్థిత్వంపై ఇలా
ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానే సుపరిచితుడు. దళిత నాయకుడిగా కానీ, కార్యకర్తగా గానీ, తన సామాజిక వర్గానికి ఏదైనా సాయపడిన వ్యక్తిగా కానీ ఆయనను ఎవరూ గుర్తించరని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, దళిత నాయకుడు బెజవాడ విల్సన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలో మార్పులను ప్రభావితం చేయడం ద్వారా ప్రజలకు తాను ఏదైనా చేయగలనన్న సంకేతాలు ఇచ్చేందుకే రామ్నాథ్ కోవింద్ను బీజేపీ ఎంపిక చేసిందని, ఇది దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే జరిగిందని ఆయన విమర్శించారు.
రాజ్యాంగంలో మార్పుల కోసమే బీజేపీ ఎత్తు ఇలా
యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఎంపిక దేశానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ను ఏకంగా రాష్ట్రపతిని చేయడం ద్వారా అటువంటి సంకేతాలను ఇవ్వాలనుకుంటున్నదని విల్సన్ వివరించారు. దళితుల ఓట్లను చీల్చడానికే బీజేపీ కోవింద్ను ఎంపిక చేసిందని దళిత మేధావి, రచయిత చంద్రభాన్ ప్రసాద్ ఆరోపించారు. దళితవర్గంలోని ఉపకులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాకుమార్ను తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రతిపక్షం బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నదని ఆయన అన్నారు. 27 ఏళ్లుగా తాను దళిత పోరాటాల్లో ఉన్నానని, తానెప్పుడూ కోవింద్ అనే వ్యక్తిని దళితులకు సంబంధించిన విషయాల్లో చూడలేదని చెప్పారు. కోవింద్లోని దళిత అస్తిత్వాన్ని విల్సన్, ప్రసాద్ ప్రశ్నించారు.
దళితులపై దాడుల పట్ల స్పందించని రామ్ నాథ్ కోవింద్
ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులపై దాడులు పెరిగాయి. కోవింద్ ఎక్కడైనా, ఎప్పుడైనా వాటిని ప్రశ్నించారా? కనీసం ప్రస్తావించారా? అని వారు అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎంపీ ఆహిర్వార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమపై జరుగుతున్న దాడులను ప్రశ్నించలేని పరిస్థితులను దేశవ్యాప్తంగా ఓవైపు దళితులు ఎదుర్కొంటుండగా, మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళిత వ్యక్తి నామినేషన్ వేస్తుండడం కపటత్వానికి పరాకాష్ఠ అని ఆయన విమర్శించారు. బ్రాహణ మనువాద మతవాద శక్తులకు వ్యతిరేకంగా రాష్ట్రపతి భవన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులకు ఎప్పటికీ నచ్చదని ఆహిర్వార్ అన్నారు. దళితులను విస్మరించి ఏ రాజకీయ పార్టీ మనలేదన్నది ప్రస్తుత రాజకీయ పరిణామాలతో స్పష్టమవుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేయడం ద్వారా తన దీర్ఘ కాలిక ప్రణాళిక బయట పడుతున్నదని బెజవాడ విల్సన్ వ్యాఖ్యానించారు. రాజ్యాగంలో తాము చేయదలుచుకున్న మార్పులను, కోరుకుంటున్న మార్పులను నిర్విఘ్నంగా చేసేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నదన్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నియామకం మాదిరిగానే ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ను రాష్ట్రపతిగా చేయగలమని సంకేతాలివ్వడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. హర్యానాలో మిర్చిపూర్, గుజరాత్ లోని ఉనా, మహారాష్ట్రలోని అహ్మద్ నగర్, రామ్ నాథ్ కోవింద్ సొంత రాష్ట్రంలోని సహరాన్ పూర్, సంభాల్, ఉన్నావో, మెయిన్ పురిల్లో దళితులపై హింసాత్మక దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇలా ఎదురుదాడి
ఇదిలా ఉంటే రాష్ట్రపతి వంటి ఉన్నత స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగి ఉంటే బాగుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. విపక్షాలతో సంప్రదించాకే తాము రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి.. దళితుల జపం చేస్తుందని ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ 1997లో కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు పోటీ పెట్టింది కూడా ఇదే బీజేపీ నాయకత్వం అన్న సంగతి విస్మరించరానిదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంతో విపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలని భావించిన అధికార పక్షానికి కాంగ్రెస్ తదితర పక్షాలను అదే అస్త్రాన్ని ప్రయోగించడంతో పరిస్థితి తిరగబడింది. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడీఎంకేలోని రెండు గ్రూపులు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలుపడంతో ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయమైనా.. 2019 ఎన్నికల నాటికి విపక్షాల మధ్య ఐక్యత పెంపొందించడంతోపాటు అన్ని వర్గాల వారిని దరి చేరుకునేందుకు కాంగ్రెస్ తదితర పార్టీలకు వీలు కలుగుతుంది. తొలుత బీఎస్పీ అధినేత మాయావతి.. బీజేపీ దళిత అభ్యర్థి వైపు మొగ్గినా.. మీరా కుమార్ అభ్యర్థిత్వానికే మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.
మీరా కుమార్ విశిష్ఠతలిలా..
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు వచ్చిన మీరాకుమార్ ఎన్నో విశిష్టతలను పుణికి పుచ్చుకున్నారు. ఐదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు కేంద్రమంత్రి పదవి చేపట్టారు. ప్రథమ మహిళా స్పీకర్గా రికార్డు దక్కించుకున్నారు. గొప్ప దళితనేతగా పేరొందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని జగ్జీవన్రాం ఏకైక కుమార్తె అయిన మీరా న్యాయశాస్త్రం చదివారు. బీహార్లోని ఆరాలో 1945లో జన్మించిన మీరా డెహ్రాడూన్, జైపూర్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్లో న్యాయశాస్త్రం చదివారు. 1970లో ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరి అనేక దేశాల్లో పనిచేశారు. దౌత్య జీవితంలో భాగంగా పలుభాషలను నేర్చుకున్నారు. 1980లలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. యూపీలోని బిజ్నోర్, ఢిల్లీ కరోల్బాగ్ నుంచి లోక్సభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో తండ్రి ప్రాతినిధ్యం వహించిన సాసారాం నుంచి పోటీచేసి విజయం సాధించారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా (2004 - 09) పనిచేశారు. 2009లో లోక్సభ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికయ్యారు.