జగన్: కెసిఆర్ వ్యూహం బెడిసికొట్టిందా?
జగన్ను అంచనా వేయటంలో మొదట కెసిఆర్ విఫలమయ్యారా అనే చర్చ సాగుతోంది. జగన్ను సరిగా అంచనా వేయలేకపోవడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి వెళ్లేందుకు అప్పట్లో సిద్దమైనట్లుగా వార్తలు వచ్చాయని అంటున్నారు. జగన్ తెలంగాణ ప్రాంతానికి రాడని, కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతాడని భావించిన తెరాస అప్పట్లో ఆయనను విమర్శించలేదు. ఆయన అవినీతిపై కాంగ్రెసు, టిడిపిలు ధ్వజమెత్తినప్పటికీ తెరాస మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడక పోయేది.
దీనిని టిడిపి పలుమార్లు ప్రశ్నించింది. అంతేకాదు ఇందిరాపార్కు వద్ద జగన్ గత సంవత్సరం ఫిబ్రవరిలో చేసిన ఫీజు పోరు దీక్షకు టిఆర్ఎస్ పార్టీ జనాన్ని తరలించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెసులో ఉన్నప్పుడు జగన్ను అడ్డుకున్న టిఆర్ఎస్ ఆ తర్వాత మాత్రం నిజామాబాద్లో అంతగా అడ్డుకోలేదు. సీమాంధ్రలో జగన్ ప్రభావం, తెలంగాణలో తమ ప్రభావం ఉందని, టిడిపి, కాంగ్రెసుల పరిస్థితి దారుణంగా ఉందని భావించిన టిఆర్ఎస్ ఎన్నికలు తీసుకు రావడం కోసం జగన్తో సై అందట.
ఎన్నికలు వస్తే జగన్ కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతాడని కెసిఆర్ గట్టిగా నమ్మడం వల్లనే ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు వైయస్సార్ కాంగ్రెసుతో దోస్తీకి సై అన్నారని అంటున్నారు. అంతేకాక ఒకవేళ జగన్ తెలంగాణలో అడుగు పెట్టాలనుకున్నా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టిడిపి, కాంగ్రెసులు మసకబారాయని, పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న జగన్ పార్టీకీ ఇక్కడ అదే తరహా పరిస్థితి ఎదురవుతుందని ఆయన భావించి ఉంటారంటున్నారు.
అయితే జగన్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో కెసిఆర్ విఫలమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే మొదట తన తెలంగాణ పర్యటనలో తెరాస సహాయాన్నే అందిపుచ్చుకున్న జగన్ ఇప్పుడు ఆ పార్టీకే సవాల్ విసురుతున్నారని అంటున్నారు. పరకాల ఉప ఎన్నికనే ఇందుకు నిదర్శనమంటున్నారు. పరకాల ఉప ఎన్నిక తర్వాతనే తెరాస జగన్ పార్టీని టార్గెట్గా చేసుకుందని చెబుతున్నారు.
జగన్ తెలంగాణకు రాడని, వచ్చినా లాభం ఉండదని భావించిన తెరాసకు ఆ పార్టీ ఇప్పుడు వరుసగా షాక్లు ఇస్తోంది. దీన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఆ పార్టీపై ఇటీవల మాటల దాడి పెంచారని చెబుతున్నారు. విజయమ్మ సిరిసిల్ దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతోపాటు... జగన్ అవినీతి పైన ఇటీవల ఆ పార్టీ జోరుగా మాట్లాడుతోంది. అసంతృప్త నేతలు, పలు ప్రాంతాల్లో బలమైన నేతలు జగన్ పార్టీలో చేరుతున్నారు. దీంతో తెరాస జగన్ పైన మాటల యుద్ధం పెంచింది.