వైయస్ పేరును తొలగించారు, బొమ్మనూ..
వైయస్ చేపట్టిన పథకాల క్రెడిట్ జగన్ ఖాతాలకు వెళుతున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ ప్రభుత్వం క్రమంగా వైయస్సార్ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందనేది జగన్ పార్టీ నేతల వాదన. ఈ నేపథ్యంలో కిరణ్ ప్రభుత్వం ఆ దిశగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా జూబ్లీహిల్స్లోని వైయస్సార్ భవన్(ఆరోగ్యశ్రీ భవన్) నుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాదు భవన్లోకి వెళ్లగానే దర్శనమిచ్చే నిలువెత్తు వైయస్ బొమ్మను కూడా అక్కడ్నుంచి తొలగించారు.
ఆ స్థానంలో రేపో మాపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. 2009 సెప్టెంబర్ 2న వైయస్ మరణించిన మరుసటి రోజే ట్రస్ట్ భవన్ ఉద్యోగులు సంతాప సభ ఏర్పాటు చేశారు. దీంతోపాటే ఈ భవన్కు వైయస్సార్ భవన్గా పేరు పెట్టాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఈ తీర్మానాన్ని ఓకే చేశారు. అప్పటినుంచి ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్, వైయస్సార్ భవన్గా చలామణీ అవుతోంది.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వెబ్సైట్లోగానీ, కార్డ్లలోగానీ ఓ వైపు సిఎం ఫొటో, మరోవైపు వైయస్ ఫొటో ఉండేది. ఇప్పుడు కేవలం కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో మాత్రమే పెట్టారు. అంతేకాదు డయాగ్నస్టిక్స్ స్లిప్లు, ఓపీ స్లిప్లు, కేస్ షీట్ స్లిప్పుల్లోనూ వైయస్ ఫొటో తీసేశారు. ఇకపై ఆరోగ్యశ్రీ భవన్కు వచ్చే ఉత్తరాల్లోగానీ, ఇక్కడ నుంచి పంపే లెటర్లలోగానీ, లెటర్ హెడ్లలోగానీ, చిరునామాలో గానీ ఎక్కడా వైయస్సార్ భవన్ అనే పేరు కనిపించకూడదని ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
గతంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వైయస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎదురుగా, జూబ్లీహిల్స్ అనే చిరునామా ఉండేది. ఇప్పుడు వైయస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రెండు పేర్లనూ తొలగించారు. ఆ స్థానంలో ఆ భవనానికి ఉన్న డోర్ నంబర్ వాడుతున్నారు. రాజీవ్ మరణించినా ఆయన పేరు మీద ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతోందని, మరి వైయస్కు ఈ విధానం ఎందుకు వర్తించదని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.