తేనెటీగల దాడి: బస్సులోకి తుర్రుమన్న షర్మిల
ఓ చెట్టు పై ఉన్న తేనె తుట్టె కదలడంతో ఈగలు ఒక్కసారిగా లేచాయి. దాంతో పాదయాత్రలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను గాయపరిచాయి. షర్మిల సమీపంలోని బస్సులోకి వెళ్లి తలదాచుకున్నారు. దీంతో ఆమెకు ప్రమాదం తప్పింది. జూలూరుపాడు బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ప్రజాసంక్షేమం పట్టని ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుతున్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు దాపురించాయన్నారు. ఎన్టీఆర్ రెక్కల కష్టంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో కిరణ్కుమార్రెడ్డి అధికారంలో చలామణి అవుతున్నారని., వీరిద్దరూ దొందు దొందేనని షర్మిల అన్నారు.
గత 137 రోజులుగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. 138వ రోజు శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ఖమ్మం జిల్లా సాయిరాం తండా నుంచి ప్రారంభించారు. రాత్రి వేపులగడ్డలో ఆమె బస చేస్తారు.