వివేక్తో పోటీ: రాజనర్సింహ చేతికి టీవీ చానెల్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి నెలల గడువు మాత్రమే ఉన్న నేపత్యంలో దళిత నేతల్లో పోటీ పెరిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి దళిత నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న దళిత నేతలు పరస్పరం పోటీ పడుతున్నారు. మీడియా విషయంలో కూడా ఈ పోటీ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
కాంగ్రెసులో ఉండి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ ఇప్పటికే ఓ టీవీ చానెల్ను నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓ పత్రిక కూడా పెట్టే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితనేతనే అవుతారని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఆ పదవికి పోటీ లేకుండా చేసుకునే ఉద్దేశంతో వివేక్ ఉన్నారని, అందువల్లనే మీడియాను విస్తరిస్తున్నారని అంటున్నారు.
వివేక్తో పోటీ పడుతున్నారా అనే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా మీడియా వైపు దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. కొత్త ఏర్పడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఆయన తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనకు కాంగ్రెసు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఆయన జీ 24 గంటలు టీవీ న్యూస్ చానెల్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ టీవీ చానెల్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సన్నిహిత బంధువుల చేతుల్లో ఉంది. నష్టాల్లో కూరుకుపోవడంతో వారు దాన్ని విక్రయించే ఉద్దేశంతో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో దామోదర రాజనర్సింహ దానిపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.