సర్వేలతో లోకేష్ దూకుడు: అసంతృప్తికి బాబు చెక్
నారా లోకేష్ పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు తన మిత్రుల అండదండలతో సర్వేలు దాదాపు పూర్తి చేశారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగా ఏ నియోజకవర్గం నుండి ఎవరిని నిలపాలనే అంశంపై కూడా లోకేష్తో పాటు పార్టీ సీనియర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారట. సీనియర్లతో కలిసి తాను చేసిన సర్వే వివరాలను ఆయన తన తండ్రి దృష్టికి ఇప్పటికే తీసుకు వెళ్లారట. ఆ సర్వేలపై బాబు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తుండగా మరోవైపు చంద్రబాబు కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రకటనలపై కూడా అంతే దూకుడుగా వ్యవహరించాలని చూస్తున్నారట. లోకేష్ ప్రధానంగా చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు బాబు యాత్ర అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పూర్తయింది.
త్వరలో ఖమ్మం జిల్లాలో ప్రవేశించనుంది. అనంతపురం నుండి ఖమ్మం జిల్లాల వరకు 120 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలల్లోని అభ్యర్థులపై లోకేష్, బాబు, సీనియర్ నేతలు సమీక్షలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చారట. 2014లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా బాబు తన పార్టీ అభ్యర్థులను ఎన్నికల కంటే చాలా ముందు ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారట.
ఇందులో భాగంగా పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ప్రకటించనున్నారట. చాలా నియోజకవర్గాల అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారట. చాలా రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తుల బెడద తప్పించుకోవచ్చుననే భావనతో చంద్రబాబు ఉన్నరట. అందులో భాగంగా లోకేష్ సర్వే ఆధారంగా బాబు అభ్యర్థుల ప్రకటనను త్వరత్వరగా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.