చంద్రబాబు, లోకేష్లపై జగన్ సాక్షి సెటైర్లు
తమ్ముళ్లకు తండ్రీకొడుకుల ఝలక్ అంటూ శీర్షిక పెట్టి, కార్జూన్లు వేసి వారిద్దరిపై సాక్షి డైలీ వ్యాఖ్యలు చేసింది. మీ కోసం యాత్రలో చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా లోకేష్ చేస్తున్న ప్రకటనలు చూసి పార్టీ నేతలంతా ముక్కున వేలేసుకుంటున్నారట అంటూ వ్యాఖ్యానించింది. టిడిపి నేతలుగా ఎదిగి,త ఇప్పుడు వీడిపోతున్నవారంతా ద్రోహులేనని లోకేష్ ఇటీవల ట్విట్టర్లో కామెంట్ చేసి లోకేష్ పెద్ద పెద్ద బాబులనే భుజాలు తడుముకునేలా చేసారని వ్యాఖ్యానించింది.
సర్లే.... ఏదో పిల్లవాడు... తన తండ్రి కూడా మరో పార్టీ నుంచి వచ్చిన వారన్న విషయాన్ని మరిచిపోయి అలా రాసి ఉంటారులే అని పార్టీ నేతలెవరూ దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు నటించేశారట అని సాక్షి ఓ చురక అంటించింది. అదో సర్దుపోదామనుకుంటున్న వేళ... పార్టీ అధ్యక్షుడు మరింత షాక్ ఇచ్చారని, పార్టీలో తనకు అన్యాయం జరగుతున్నందువల్ల టిడిపిని వీడుతున్నట్లు ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్టీ నాయకుడొకరు ప్రకటన చేశారని, దాంతో చంద్రబాబు కోపం కట్టలు తెంచుకుందని, పార్టీలో పదవులు అనుభవించి, తర్వాత పార్టీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారంటూ చంద్రబాబుపై తీరుపై వివరించింది.
దాంతో ఆగకుండా - ఇక నుంచి ఎవరికి పదవి ఇవ్వాలన్నా... ఆ నాయకుడికి సంబంధించి అటు మూడు తరాలు, ఇటు మూడు తరాలు టిడిపికి విశ్వాసపాత్రులుగా ఉన్నవారికే పదవి ఇస్తానని ఆవేశంగా చెప్పేశారని, దీంతో పార్టీ నేతల మైండ్ బ్లాంకయ్యిందట అని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది.
మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెసులో మంత్రి పదవి అనుభవిస్తూ టిడిపిని ఏర్పాటు చేసిన సొంత మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని సవాల్ చేసిన చంద్రబాబు.... ఇప్పుడు అటు మూడు తరాలు, ఇటు మూడు తరాలు చూసి పదవి ఇస్తానంటే.. మైండ్ బ్లాంక్ కాక మరేమవుతుందంటూ కాస్తా మసాలా దట్టించి సాక్షి డైలీ చంద్రబాబుపై తన వ్యతిరేకతను చాటుకుంది.