ఎన్నికలయ్యాక రేప్ చేయపోయారా?: పాటిల్
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్ ఆర్ పాటిల్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలోను నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాల పైన చులకనగా మాట్లాడి విమర్సల పాలయ్యారు.
అత్యాచారానికి పాల్పడిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అభ్యర్థి ఒకరు జైలుకు వెళ్లడం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఎన్నికలయ్యాక ఆ పని చేయలేక పోయారా అని వ్యాఖ్యానించారు.
ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఈ రోజు తనను కలిశారని, తనకు మద్దతు ఇస్తామని చెప్పారని తెలిపారు. వారు తనకు మద్దతిస్తామని చెప్పడంతో.. ఎందుకు అని వారిని ప్రశ్నించానని చెప్పారు. అయితే, తమ అభ్యర్థి జైలులో ఉన్నాడని వారు తనతో చెప్పారన్నారు.
ఎందుకు జైలులో ఉన్నాడని, అంత మంచి పని ఏం చేశాడని తిరిగి వారిని తాను ప్రశ్నించానని, దానికి వారు.. అత్యాచార కేసు మోదయిందని, దాంతో అతను కారాగారానికి వెళ్లాడని చెప్పారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కాదలుచుకుంటే ఎన్నికల తర్వాత అత్యాచారం చేసి ఉండవచ్చు కదా అని తాను ప్రశ్నించానని తెలిపారు. దీని పైన విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. ఎవరినైనా బాధించి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. మహిళలను కించపర్చాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని ఆర్ఆర్ పాటిల్ చెప్పారు.
పాటిల్ వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ సంజయ్ పాటిల్ మండిపడ్డారు. ఆర్ఆర్ పాటిల్ వంటి వారు పూలే, అంబేడ్కర్ వంటి వారి గురించి మాట్లాడం విడ్డూరమన్నారు. కాగా, సదరు ఎంఎన్ఎస్ పార్టీ అభ్యర్థి పైన 2007లో అత్యాచార కేసు నమోదయింది. 2011లో మరో అత్యాచారం, వేధింపుల కేసు నమోదయింది.