జైరాం కాళ్లు పట్టుకున్న ఎమ్మెల్యే, నేలకేసి కొట్టారు
న్యూఢిల్లీ: తెలంగాణపై మంత్రుల బృందం (జివోఎం) భేటీ అయిన హోంశాఖ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు మంగళవారం ధర్నా చేశారు. కేంద్రం తీరుపై నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నార్త్బ్లాక్ వద్దకు చేరుకున్నారు.
ఆ సమయంలో జివోఎం సభ్యులు జైరాం రమేశ్ భేటీ కోసం అక్కడికు రాగా ఆయన కారును చుట్టుముట్టారు. సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి నమస్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హఠాత్తుగా జైరాం కాళ్లు పట్టుకున్నారు. సీమాంధ్రకు అన్యాయం చేయొద్దని, ఏకపక్షంగా ముందుకెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
దీంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది వారిని పక్కకు తప్పించి జైరాంను లోనికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ నేతలందర్నీ తరలించేందుకు యత్నించగా, కొద్దిసేపు తోపులాట జరిగింది. తమకు న్యాయం చేయాలని, సీమాంధ్రకు అన్యాయం చేయవద్దని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆ తర్వాత మరో జివోఎం సభ్యులు నారాయణ స్వామి అక్కడికి రాగా, ఆయన కారుపై ఎర్రబుగ్గను పయ్యావుల లాగి, నేలకేసి కొట్టారు. దీంతో ఎమ్మెల్యేలను, నేతలందర్నీ పోలీసులు చుట్టుముట్టి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. ఎపి నుండి ఎన్నికైన జైరాం రమేష్ రాష్ట్రాన్ని చీల్చడం దారుణమన్నారు.