చిరునవ్వు, చిటపట: రసమయీ..ఓ పాట పాడవా!
హైదరాబాద్: శాసనశభ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రధాన ద్వారం వద్ద శుక్రవారంనాడు నిరసనకు దిగారు. అదే సమయంలో శాసనసభ నుంచి బయటకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ద్వారానికి అడ్డంగా బైఠాయించిన ఎమ్మెల్యేలను పక్కకు జరిపించి దారి చేసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.
రైతుల ఆత్మహత్యలపై ఒక పాట పాడాలని టిడిపి శాసనశభ్యులు రసమయిని కోరారు. ఆయన చిరునవ్వుతో ముందుకు కదిలారు. ‘మా నిరసనకు సంఘీ భావం తెలిపిన రసమయికి ధన్యవాదాలు' అని ఒక ఎమ్మెల్యే అనడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చంపించిన పార్టీ రైతుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
రసమయి బాలకిషన్ ధూంధాం కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. పాటలు పాడుతూ ఆయన ఉద్యమానికి తన వంతు సహాయం చేశారు. అందుకు ప్రతిఫలితంగానే తెరాస నుంచి శానససభకు పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది. పోటీ చేసి విజయం సాధించి ఆయన శాసనసభలోకి అడుగు పెట్టారు.
కట్టేది ధోతి, తీసేది గోతి..
ధోతి కట్టుకున్న పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతులకు మేలు జరుగుతుందనుకున్నామని, కానీ ఆయన రైతులు ఆత్మహత్యలకు పాల్పడేలా గోతులు తవ్వుతున్నారని తెలుగుదేశం శాసనసభ్యులు సభ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత వ్యాఖ్యానించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పంట నష్టం గా లెక్కేస్తున్నారంటూ రైతులను అవహేళన చేయడం దారుణమని మండిపడ్డారు.