హతమార్చాలని వేదాలే చెప్తున్నాయ్:షాకి డిగ్గీ కౌంటర్
ఢిల్లీ: గోవును వధించే వారిని హతమార్చాలని వేదాలే చెబుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పత్రిక పాంచజన్యలో ప్రచురించిన ఓ వ్యాసం స్పష్టం చేసింది. ఆవు మాంసం స్వీకరించాడన్న అనుమానంతో దాద్రీలో ఇక్లాఖ్ను చంపిన అంశంపై నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ పత్రిక ఈ తరహా వ్యాసం ప్రచురించడం గమనార్హం. గోవధ అనేది హిందూమతస్తులకు అత్యంత పెద్ద విషయమని పేర్కొంది. చాలామందికైతే జీవన్మరణ సమస్యలాంటిది అని ఆ వ్యాసం పేర్కొంది. దాద్రీ ఘటనపై సాహితీవేత్తలు తమ పురస్కారాలను తిరిగి ఇచ్చేయడాన్ని ఈ వ్యాసం తీవ్రంగా ప్రశ్నించింది.
దాద్రీలో ఇదివరకు ఎన్నడూ కూడా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తనే లేదని, ఇక్లాఖ్ నిష్కారణంగానే మరణించాడని ఎవరైనా అనుకుని ఉండవచ్చునని, అయితే ఈ సందర్భంగా ప్రతీచర్యకు అదేస్థాయిలో ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ సూత్రాన్ని స్మరించుకోక తప్పదని పేర్కొంది.

ఎందుకంటే, అసలు ప్రశాంతమైన దాద్రీలో నిష్కారణంగా ఇలాంటి ఘటన జరిగి ఉండదని పాంచజన్య వ్యాసం పేర్కొంది. అసలు ఇఖ్లాక్ అలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నేపథ్యంలో అందుకు కారణమైన సామాజిక ఆలోచనా విధానాన్ని ఈ రచయితలు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని పేర్కొంది.
పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తున్న సాహితీవేత్తల యోగ్యతలపై కూలంకషంగా దర్యాఫ్తు జరగాల్సి ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా, పాంచజన్య పత్రిక వ్యాసం పైన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు అమిత్ షా ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్కు సమన్లు జారీ చేస్తారా అని ట్వీట్ చేశారు. అమిత్ షా బిజెపి నేతలకు, ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులకు సమన్లు జారీ చేశారని, ఇప్పుడు ఆరెస్సెస్ కథనం పైన సమన్లు ఇస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications