సిగ్గుపడ్తున్నా:అమిత్షాకు సీనియర్ నేత షాకింగ్ లేఖ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ఆ పార్టీకి, పార్టీ అధ్యక్షులు అమిత్ షాక్ గట్టి షాకిచ్చారు. పార్లమెంటు సమావేశాలు వాడిగావేడుగా సాగుతాయని భావిస్తున్న వేళ హిమాచల్ ప్రదేశ్ బిజెపి నేత శాంత కుమార్.. షాకు షాకింగ్ లేఖ రాశారు.
ఇటీవలి కాలంలో పార్టీని చుట్టిముట్టిన వివాదాలు పరువు తీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రోజు రోజుకూ పార్టీలో వివాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారు.
ఎథిక్స్ కమిటీ నియామకమూ జరగాలన్నారు. మధ్య ప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. దీంతో మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో చెరరేగిన వివాదాలను కూడా ఆయన గుర్తు చేశారు.
ఇవన్నీ విపక్షాలకు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆయుధాలుగా మారాయన్నారు. శాంత కుమార్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.
కాగా, శాంత కుమార్ వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఇతను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇతను జూలై 10వ తేదీన తాను అమిత్ షాకు రాసిన లేఖను ఫేస్బుక్లో పోస్టు చేశారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. తాను లేఖలో రాసిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.