పవన్ కల్యాణ్ జనసేన: నెంబర్ టూ ఎవరు?
విజయవాడ: జనసేనలో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకవీరుడు. కానీ పార్టీని నడిపించడానికి ఓ యంత్రాంగం అవసరం. ఆ యంత్రాంగంలో ఎవరు ఉంటారు, పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ టూ ఎవరు అనే చర్చ సాగుతోంది. తిరుపతి సభ తీరును బట్టి చూస్తే పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది.
ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరుపై రాజకీయాల్లో వేడి వేడి చర్చ సాగుతోంది, హోదా కోసం ఆందోళనలకు పవన్ పిలుపునిచ్చారు. దీంతో భవిష్యత్ కార్యక్రమాలపై అభిమానులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.
కాకినాడ సభకు ఎవరిని ఆహ్వానించాలనే విషయంపై పవన్ కల్యాణ్ అభిమానులు తర్జనభర్జనలు పుడుతున్నారు. చిరంజీవి అభిమానులు కూడా పవన్ కల్యాణ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత స్థితిని గమనిస్తే రానున్న రోజుల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు సమర్థవంతుడైన నాయకులు అవసరమని అభిమానులు గుర్తించారు.
దీప్రస్తుతం పార్టీలకు అతీతంగా ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ కోటేశ్వరరావు పేరును కొందరు ఆభిమానులు సూచించారు. ఇప్పటి వరకు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ చిరు, పవన్ అభిమానులు చేపట్టే కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ వస్తున్నారు.
అయనతోపాటు చైర్పర్సన్ రత్నమాల సోదరుడు కొవ్వలి నాయుడు పేరును కూడా అభిమానులు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. తరచూ నరసాపురం నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం కొవ్వలి కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది.