విడాకుల కోసం: పెళ్లి బట్టలను ఈ-బేలో అమ్మేసింది
లండన్: భర్తకు విడాకులు ఇవ్వడానికి ఓ వివాహిత తన పెళ్లి బట్టలను (గౌను) అమ్మకానికి పెట్టి సంచలనంగా మారింది. ఈ ఘటన ఇంగ్లాండ్లోని లండన్లో చోటు చేసుకుంది. తన భర్త మోసగించాడన్న ఆరోపణలపై చెస్టర్ఫీల్డ్కు చెందిన సమంత వ్రాగ్ అనే మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
కోర్టు ఫీజులు చెల్లించడానికి పెళ్లి రోజు వేసుకొన్న దుస్తులను ఈ-కామర్స్ వెబ్సైట్లో బేరం పెట్టింది. వేలంలో రూ.1.75 లక్షల (2000 పౌండ్లు) విలువైన డ్రస్ ప్రారంభ బిడ్డింగ్ ధర సుమారు రూ.43 వేలకు పెట్టింది.
18నెలల క్రితం తనను వదిలి వెళ్లిన భర్త మరో మహిళతో కాపురం పెట్టాడని మీడియాకు సమంత తెలిపారు. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నానని, అందుకోసం 2014 ఆగస్టులో జరిగిన వివాహం సందర్భంగా ఇష్టపడి కుట్టించుకున్న డిజైనర్ పెళ్లి డ్రెస్ను ఈ-బే సైట్లో అమ్మకానికి పెట్టానని చెప్పారు.
ఇప్పటివరకు 12 మంది కొనుగోలుదారులు డ్రెస్ వివరాలపై ఆరా తీశారని చెప్పారు. ఎన్నో కలలు, ఊహలతో దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన తనకు అవి ఎలాగూ దక్కలేదు. కనీసం వేరొకరికన్నా ఈ దుస్తులు సంతోషాన్ని, మంచి జీవితాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.