అవునా...జగన్ ఇంక టీవీ ఛానెళ్లలో కనిపించడా?..అందుకే అంటున్న ప్రతిపక్షం...
అమరావతి: ఎపి ప్రతిపక్ష నేత జగన్ ఇక ముందు టివి ఛానెళ్లలో కనిపించడా...వచ్చే ఎన్నికల నాటికి జగన్ బొమ్మ కానీ గొంతు కానీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం వినిపించడం జరగదా....అపర రాజకీయ చాణుక్యుడు చంద్రబాబునాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు అమలైతే గనుక అదే జరుగుతుందంటున్నారు జగన్ మద్దతుదారులు. అందుకు వారు చూపుతున్న కారణం ఇది...
Recommended Video

ఎపి ప్రభుత్వం రూపకల్పన చేసిన పైబర్ గ్రిడ్ పథకం బుధవారం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా ప్రకారం రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు ఈ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు చేరాలి. ఒకే కేబుల్ ద్వారా చౌకగా టెలిఫోన్ కేబుల్ తో పాటు ఇంటర్నెట్, టివి కనెక్షన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇక్కడే జగన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

ఆందోళన ఎందుకంటే...
కారణాలేమైనా ఒక్కసారంటూ కేబుల్ వ్యవస్ధ గనుక ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతే ఒక వైరిపక్షాల గొంతు ప్రజలకు వినబడదనేది వారి ఆందోళనకు కారణం. అది జగన్ కావచ్చు లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే మరో వ్యక్తి కావచ్చని అంటున్నారు. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకున్న వారెవరైనా ఇంట్లో టివి ఆన్ చేస్తే ప్రభుత్వ పథకాలు, చంద్రబాబునాయుడు, లోకేష్, అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తప్ప ఇంకోటి కనబడే అవకాశాలు ఉండవంటున్నారు.

ప్రభుత్వానికి ఆయుధం...
పైకి 149 రూపాయలకే టివి, ఇంటర్నెట్,టెలిఫోన్ కనెక్షన్లు అని ఇప్పుడు తేనెపూసి చెప్పినా, ఫైబర్ గ్రిడ్ తెలుగుదేశం పార్టీ భారీ రాజకీయ పథకం అంటున్నారు. ఇది టివి ప్రసారాలను కంట్రోల్ చేసేందుకు, ప్రత్యర్ధి చానెళ్లేవయినా వుంటే అదుపు చేసేందుకు ఉద్దేశించిన వ్యవహారమనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. టివి ప్రసారాల మీద ప్రభుత్వం కంట్రోల్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల వాళ్లకి బాగా తెలుసని, ముందు తెలంగాణలో రెండు చానెళ్లను కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేసిన సంగతి అందరూ చూశారంటున్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఇది తమకు సంబంధం లేదని, అదంతా కేబుల్ ఆపరేటర్ల పని అని తప్పుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ ఆంధ్రా ఛానెళ్ల పేరుతో తెలంగాణాలో ఆ పని జరిగిందని, రేపు ఇలాగే వేర్వేరు కారణాలతో ఈ ఫైబర్ గ్రిడ్ అపరేటర్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేసే చానెళ్లను మూసేయవచ్చని, అదే జరుగుతుందని అంటున్నారు.

అందుకే అనుమానాలు...
అభివృద్ధిని అడ్డుకుంటున్నారనో, ఇంకేదో కారణంతోనో స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడేవారు కోకల్లలని విమర్శిస్తున్నారు. తమ అనుమానాలకు కారణం ఈ ఫైబర్ గ్రిడ్ లైసెన్స్లులు ఎవరికి పోతున్నాయో తెలుసుకుంటే ఎవరికైనా అర్థమవుతాయంటున్నారు.కర్నూలు కేంద్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని డిప్యూటీ సీఎం కెఇ క్రిష్ణమూర్తి బంధువులకు అప్పగించగా, నంద్యాలలో మంత్రి భూమా అఖిల ప్రియ కుటుంబానికి చెందిన కేబుల్ సంస్థకు దక్కిందని చెబుతున్నారు. అయినా వీళ్లకి కాకుండా వేరేవారికి ఈ లైసెన్సులు ఎలా దక్కుతాయా అని వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఒక సందర్భంలో ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో అధికారపార్టీకి చెందిన కేబుల్ ఆపరేటర్లకే వీటిని అప్పగించారనే సమాచారం అందిందని కూడా ఆయన చెప్పారు.

టిడిపి నేతలకే లైసెన్సులు...
ఎపిలో ఫైబర్ నెట్ లైసెన్సులు శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్లకు అప్పగించారని, వీరిద్దరూ అధికార తెలుగు దేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే నని ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. కాకినాడ, రాజమండ్రిలో కొండలరావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారని, కొండల్రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్గా కొనసాగుతున్నారని వెల్లడించారు. వైఎస్సార్ కడపలో జ్యోతి కేబుల్కు కూడా అప్పగించారని, ఇది అధికారపార్టీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందినదని తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్కు చెందిన సిటీ కేబుల్కు ఫైబర్గ్రిడ్ ఏజెన్సీ అప్పగించారని తమకు తెలిసిందని ఆయన చెప్పారు.

ఇప్పటికే కొన్నిచోట్ల...
ఇప్పటికే కేబుల్ ప్రసారాలపై ప్రభుత్వం కొన్ని చోట్ల అనధికార నిషేధాన్ని వారికి అవసరమైనప్పుడు విధిస్తున్నారని జగన్ అభిమానులు గుర్తుచేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను అరెస్టు చేసినపుడు అరెస్టు దృశ్యాలు, అప్పుడు జరిగిన గొడవలు బయట ప్రపంచానికి తెలీకుండా ప్రభుత్వం ప్రసారాలను నిలిపేయించిందని తెలిపారు. అలాగే ఎన్ టివి ప్రసారాలను సైతం కొంతకాలం నిలిపివేసేలా ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికీ టిడిపి ఎంఎల్ఏల హవా బాగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సాక్షి టివి ప్రసారాలను అడ్డుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయంటున్నారు. స్ధానిక కేబుల్ ఆపరేటర్లను ప్రలోభాలకు గురిచేసో లేక ఒత్తిడి పెట్టో వైసిపి కార్యక్రమాలను నిలిపేయించిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయని, అవన్నీ ఇప్పటిదాకా అనధికారికంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.

అసలు ఇదీ పద్దతి...కానీ...
ఆపరేటర్లను ఎంపిక చేయడానికి బిడ్డింగ్ ప్రక్రియ ఉండాలి. రాష్ట్రప్రభుత్వం దానిని పక్కన పెట్టి నచ్చినవాళ్లకు లైసెన్స్ లను అప్పగించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమలు ప్రక్రియ మొత్తాన్ని అధికారపార్టీకి అనుకూలురైన కేబుల్ ఆపరేటర్ల చేతిలో పెడుతున్నారు. వీరంతా ఇక ముందు చానెళ్లమీద, వార్తల మీద కంట్రోల్ పెంచుకుని ప్రాంతీయ ఫైబర్ గ్రిడ్ పాలకులవుతారని వేరే చెప్పనవసరం లేదనేది వైరిపక్షాల ఆందోళన. ఎటువంటి బిడ్డింగ్, టెండర్ నిర్వహించకుండానే ఆయా సర్కిళ్లను అప్పగించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలే ప్రభుత్వం...ఆపై ఫైబర్ గ్రిడ్...
ఒకవేళ ప్రభుత్వమే ఫైబర్ గ్రిడ్ పేరుతో అధికారికంగా కేబుల్ వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకుంటే ఇక ప్రతిపక్షాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటున్నారు. పైగా 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం కాబట్టి చంద్రబాబు ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థను త్వరగా పాతుకుపోయేలా చర్యలు వేగవంతం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికి 1.04 లక్షల కుటుంబాలకు ఈ కనెక్షన్లు ఇచ్చారని, వచ్చే మార్చి నాటికి 10 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వమే లెక్కలు చెబుతోందని తెలిపారు.

ప్రభుత్వం...చంద్రబాబు జోరు...
ప్రస్తుతం చంద్రబాబు జోరు చూస్తుంటే వచ్చే ఏడాదిలోగా 1.45 కోట్ల కుటుంబాలకూ కనెక్షన్లు ఇచ్చేసేలా ఉన్నారని జగన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఫైబర్ గ్రిడ్ తీసుకోవటానికి నిరాకరిస్తే అటువంటి వారికి మామూలు కేబుల్ కనెక్షన్ అందకుండా చేయటం పెద్ద కష్టం కాదని, అందుకే తాము ఆందోళన చెందుతున్నట్లుగా వివరిస్తున్నారు.

ఫైబర్ గ్రిడ్ పై వైసిపి కేసు...
ఫైబర్ గ్రిడ్ చంద్రబాబు అనుకున్న విధంగా ఆచరణలోకి వస్తే వైసిపికి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారికెవరికైనా ఇబ్బంది తప్పదని వైసిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్పూర్తిని కూడా కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు కుతంత్రాన్ని అడ్డకునేందుకు తమ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసారని చెబుతున్నారు. ఈ విషయమై కోర్టు కూడా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని, తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగాది. మరి, ఆకేసు ఏమవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications