స్థలం లేదు, ముస్లీంలు దహనం చేయాలి: సాక్షి మహారాజ్
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పూడ్చివేతకు స్థలం లేదని, కాబట్టి ముస్లీంలు కూడా దహన సంస్కారాలు నిర్వహించాలన్నారు.
లక్నో: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఖననం చేసేందుకు (పూడ్చివేత) స్థలం లేదని, కాబట్టి ముస్లీంలు కూడా దహన సంస్కారాలు నిర్వహించాలన్నారు.
ముస్లింలు కూడా దహన సంస్కారాలు నిర్వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో సుమారు ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, అంతమందికి శ్మశానల కోసం వేలాది ఎకరాల భూమిని కేటాయించడం సాధ్యం కాదన్నారు.
కేంద్రం ఈమేరకు ఓ చట్టం చేయాలని మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్లో ఆయన డిమాండ్ చేశారు. హిందువుల్లో సుమారు రెండున్నర కోట్ల మంది స్వాములు ఉన్నారని వారందరికి స్మారక నిర్మాణాలు చేపట్టడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.
భారత్లో ఎవరు చనిపోయినా ఖననం చేయకూడదని, దహన సంస్కారాలు మాత్రమే నిర్వహించాలని సూచించారు. అయితే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. యూపీ ఎన్నికల నేపథ్యంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.