వైసీపీ నేతలకు ప్రశాంత్కిషోర్ సర్వే షాక్, 2019లో టిక్కెట్లు దక్కేనా?
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలకు ప్రశాంత్కిషోర్ భయం పట్టుకొంది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా జగన్ టిక్కెట్లు కేటాయిస్తారని నేతల అంచనా.
ఏలూరు: ప్రశాంత్కిషోర్ పేరు చెబితేనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు భయపడుతున్నారు. సర్వే పేరుతో ప్రశాంత్కిషోర్ బృందం చేస్తోన్న హాడావుడి వైసీపీ నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది.2019 ఎన్నికల్లో టిక్కెట్లను ఆశిస్తోన్న నేతలకు ప్రశాంత్కిషోర్ భయం పట్టుకొంది.
2014 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 15 అసెంబ్లీ స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాత్రం అప్పట్లో పశ్చిమపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓటర్ల తీర్పుతో ఆయనకు దిమ్మతిరిగిపోయింది.. ఆ ఓటమితో నియోజకవర్గాల నేతల్లో ఉత్సాహం చప్పున చల్లారింది. అప్పటి నుంచి ఒకరో ఇద్దరో నాయకులు మాత్రం ప్రజల మధ్య తిరుగుతున్నారు.
సర్వే పేరిట ప్రశాంత్కిషోర్ తమను తొక్కేస్తారా అనే భయం వైసీపీ నేతలను వెన్నాడుతోంది. మమ్మల్ని తొక్కేస్తారా ఏమిటీ అనే భయం ..ఆ పార్టీ నేతల్లో కన్పిస్తోంది.
ఎన్నికల సమయంలో ఏదో రకంగా టికెట్ తెచ్చుకుంటే చాలు..

వైసీపీ నేతలకు ప్రశాంత్కిషోర్ భయం
ఎలెక్షన్కు డబ్బు ఖర్చు పెడితే చాలు.. ఈజీగా గెలిచేయవచ్చని అనుకుంటున్న నేతలకు పీకే అండ్ కంపెనీ తెగ టెన్షన్ పెడుతోంది.నేతల పనితీరుపై సర్వే ప్రశాంత్ కిశోర్ నిర్వహిస్తున్నారు. ప్రశాంత్కిషోర్ బృందం ఏ రకమైన నివేదిక ఇస్తోందోననే భయం నెలకొంది. 2019 ఎన్నికల సమయంలో తమకు టిక్కెట్లు దక్కుతాయా లేవా అనే ఆందోళన వారిలో నెలకొంది.

ప్రజల మద్య ఉండే నేతలు తక్కువే
పశ్చిమగోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండే నేతలు అతి తక్కువ. టిక్కెట్టు కోసం పోటీపడే ఆశావాహులు మాత్రం ఎక్కువే. కానీ, పార్టీ చీఫ్ జగన్ జిల్లా పర్యటన సమయంలోనే కొందరు నేతలు నియోజకవర్గానికి వచ్చేవారు ఎక్కువ. దీంతో ప్రశాంత్కిషోర్ సర్వేపై నేతలకు బెంగపట్టుకొంది. దెందులూరు తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజల మద్య ఉండే నాయకులు అతి తక్కువ. కానీ, టిక్కెట్టు కోసం పోటీపడేవారు మాత్రం ఎక్కువగా ఉన్నారు.

సర్వేలో అనుకూల ఫలితం కోసం
ఈ సర్వే గండం నుంచి బయటపడటానికి కొందరు ఇన్ఛార్జ్లు ..ఆశావహులు నియోజకవర్గాలలోని అనుయాయులకు.. సహచరులకు ఫోన్లు చేస్తూ.. 'నా గురించి మంచిగా చెప్పమని మనవాళ్లకు చెప్పండి .. త్వరలోనే నియోజకవర్గానికి వస్తా.. వారందరిని కలుస్తా' అంటూ కోరుతున్నారని సమాచారం. సర్వే సమయంలో పీకే బృందానికి అనుకూలంగా సమాధానాలు ఇప్పిస్తే ప్రయోజనం కలుగుతోందని కొందరు నేతలు భావిస్తున్నారు.

నియోజకవర్గాలకు చేరుకొంటున్న నేతలు
ప్రశాంత్కిషోర్ బృందం సర్వే సాగుతున్న నేపథ్యంలో కొందరు నేతలు నియోజకవర్గాలకు చేరుకొంటున్నారు. చిన్న చిన్న మీటింగులు నిర్వహిస్తూ..తాము బాగా పనిచేస్తున్నాము అని సర్వే బృందానికి తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రశాంత్ కిశోర్ సర్వేలో తమకు పాజిటివ్ రిపోర్టు వచ్చేలా ప్రయత్నాలను సాగిస్తున్నారు. పీకే బృందం సర్వే కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతల్లో కదలిక వచ్చిందని ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.












Click it and Unblock the Notifications