చెప్తున్నారు సరే!: జగన్ను ఆలోచనలో పడేసిన విద్యార్థిని ప్రశ్న!! ఎవరూ ఇవ్వలేరని జవాబు
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థిని ఉద్యోగాలపై ప్రశ్నించారు. ఆమె ప్రశ్న జగన్ను ఆలోచనలో పడేసిందట. ప్రతిపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరులో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులందరినీ ఉచితంగా చదివిస్తానని చెప్పారు. ఈ సమయంలో వేదిక పైకి వచ్చిన నజ్మా అనే యువతి మాట్లాడారు.

సార్, జాబ్ గ్యారెంటీ ఇస్తారా?
తాను డీ ఫార్మసీ చదివానని, ఈ కోర్సుకు ఎక్కడా జాబ్ రాలేదని, మీరేమో ఎంత వరకైనా ఉచితంగా చదివిస్తానని చెబుతున్నారని, చదివి తర్వాత జాబ్ గ్యారెంటీగా ఇస్తారా సార్.. అంటూ నజ్మా వైసీపీ అధినేతను ప్రశ్నించారు. ఆమె ప్రశ్న జగన్ను ఆలోచనలో పడేసిందట.

ఎవరూ గ్యారంటీ ఇవ్వరు, నమ్మవద్దు
కాసేపటి తర్వాత తేరుకున్న జగన్.. చదివిస్తామని, జాబ్ గ్యారెంటీ ఎవరూ ఇవ్వరని, అలా ఎవరైనా జాబ్ గ్యారంటీ ఇస్తామని చెప్పే నాయకులను నమ్మవద్దని, జాబ్ కావాలంటే ప్రత్యేక హోదా రావాలని, దాని కోసం మీరు ప్రార్థనలు చేయండని ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించారట. కాగా, చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.

హామీలు అమలయ్యాయా
సీఎం చంద్రబాబు గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని జగన్ అన్నారు. మత్స్యకారులను ఎస్సీల జాబితాలో చేర్పిస్తానని, కులాల వారీగా అన్ని కుటుంబాల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా అంటూ ప్రశ్నించారు.

నా తండ్రి ఒక్క అడుగేస్తే, నేను రెండు వేస్తా
అమలు కాలేదని అక్కడకు వచ్చిన వారు సమాధానం చెప్పారు. దీంతో జగన్ స్పందిస్తూ ఈ విధంగా ఎన్నికలప్పుడు కులాలు, మతాల వారీగా వాగ్దానాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. తన తండ్రి ఒక్క అడుగు ముందుకేసి రాష్ట్రంలోని పేదలందరినీ ఆదుకున్నారని, తాను రెండు అడుగులు ముందుకేసి అన్నివర్గాల ప్రజలకు సాయం అందిస్తానని చెప్పారు. ప్రతి కుటుంబంలోని పిల్లలు ఆసక్తిని బట్టి ఇంజినీరింగ్, వైద్యం వంటి ఉన్నత చదువులు చదవాలని, వారి ఫీజు రీయింబర్స్మెంటుగా ప్రస్తుత ప్రభుత్వం రూ.30వేలు ఇస్తుండగా తాను దానిని నుంచి రూ.లక్షకు పెంచుతానన్నారు. చిన్న పిల్లల చదువుల కోసం ఏటా రూ.15వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications