కనుమనాడు కాకి కూడా కదలదు; ప్రయాణాలు నిషిద్ధం.. ఎందుకంటే!!
సంక్రాంతి పండుగను మూడు రోజులు పాటు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ మూడింటికి దేనికదే ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు కనుమ పండుగ. ఇంట్లోని పాడి పశువులను పూజించుకుని,పెద్దలను తలచుకునే పండుగ. ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి? అసలు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి? చేయాల్సిన పూజలు ఏమిటి? కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు అని అంటారు.. అది ఎందుకు? వంటి అనేక వివరాలను తెలుసుకుందాం.
కనుమ పండుగ విశిష్టత ఇదే
మూడు రోజులపాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవరోజు కనుమ పండుగగా జరుపుకుంటాము. దీనిని పశువుల పండుగగా కూడా చెప్పుకుంటాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వ్యవసాయానికి సంబంధించి, రైతులు ఇళ్లకు కొత్త పంట చేరిన వేళ జరుపుకునే పండుగ కాబట్టి ముఖ్యంగా పాడిపంటలకు ఈ పండుగకు ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదంతా కష్టపడుతూ పంట పండించే రైతులకు, వ్యవసాయంలో తమ వంతు సాయం అందించే పశువులకు, అలాగే పితృదేవతలకు ఈరోజును అంకితం చేస్తారు.
కనుమ నాడు అమ్మవారిని పూజించి గారెల నైవేద్యం
ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మొదటి రోజును సంక్రాంతి పండుగగా, రెండవ రోజున కనుమ పండుగగా జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇక కనుమ పండుగ తరువాతి రోజున ముక్కనుమ గా కూడా జరుపుకుంటారు. శాస్త్ర ప్రకారం ఈరోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజించడం చేస్తారు. కనుమ రోజు అమ్మవారిని పూజించి, అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెడతారు.
కనుమ పండుగనాడు ప్రయాణాలు నిషిద్ధం .. ఎందుకంటే
అలాగే పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి, ఆరోజు కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మ శాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే, వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికీ ఓ సామెత చెబుతూ ఉంటారు. అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు.
కనుమ నాడు చెయ్యాల్సింది ఇదే
కనుమ నాడు పితృ దేవతలకు ప్రసాదాన్ని పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి భుజించి, అందరూ కలిసి ఒకే చోట ఉండి పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా కనుమనాడు గారెలు, మాంసంతో పెద్దలకు నైవేద్యం పెడతారు. అలాగే ప్రయాణాలు, శుభకార్యాలు చేయడం కనుమనాడు నిషేధం. ఆరోజు ఆయా కుటుంబాలలో గతించిన పెద్దలకు కేటాయించి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాంటివి మరిచిపోయి సరదాగా తిరగడం, షికార్లు చేయడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.