షూటింగ్ హబ్గా హైదరాబాద్: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని షూటింగ్ హబ్గా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు శుక్రవారం హైదరాబాదులో ఆమె ఆ విషయం చెప్పారు. హైదరాబాదులో సినిమా షూటింగ్లు చేసుకునేవారికి రాయితీ ఇచ్చేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చర్చించినట్లు ఆమె తిలాపు.
ఫిల్మ్ సిటీ ఏర్పాట్లపై కెసిఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని కవిత చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాచకొండలో గల సువిశాలమైన స్థలంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ సిటీ కోసం ఇప్పటికే కెసిఆర్ రాచకొండ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఇదిలావుంటే, ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ను తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారంనాడు ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవానికి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పోలీసులు, ప్రజలు ఏకమైతే ఏ సమస్యలూ ఉండవని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. చైన్ స్నాచర్లను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థలో మార్పు వచ్చిందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని ఆయన అన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు సాగుతాయని, మొత్తం 230 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు.
యువకులంతా యూనిఫాం లేని పోలీసులేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో పోలీసులంటే ఉన్న భయాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications