గొడవ: స్తంభించిన అసెంబ్లీ
హైదరాబాద్: తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై తక్షణమే చర్చ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేయడంతో బుధవారం శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. సభ సమావేశం కాగానే ఎగువ ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదులపై ఇతర రాష్ట్రాలు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం, మహిళలపై జరుగుతున్న దాడులపై వామపక్షాలు, సంక్షేమ హాస్టల్లో వసతుల కొరతపై ప్రజారాజ్యం పార్టీ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
తెలుగుదేశం చర్చకు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి ముందు సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ నిర్ణయంపై తాము నిరసన తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే వాయిదా తీర్మానంపై నిరసన తెలిపే అధికారం పార్టీలకు లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెసు నిరసన తెలిపిన సంప్రదాయం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని-ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని, స్పీకర్ నిర్ణయానికి సంబంధించిన విషయమని అన్నారు. తన నిర్ణయంపై నిరసన తెలిపే అధికారం లేదని ఆయన అన్నారు. తన రూలింగ్ ను పాటించాలని ఆయన ఆదేశించారు.
స్పీకర్ కె. కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. సభలో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చ జరగాల్సి ఉందని ప్రజారాజ్యం శాసనసభా పక్ష నేత చిరంజీవి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాతనైనా ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చకు అనుమతించాలని బిజెపి శాసనసభ్యుడు కిషన్ రెడ్డి (బిజెపి), జూలకంటి రంగారెడ్డి (సిపిఎం) తదితరులు కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. తర్వాతనైనా చర్చకు అనుతించాలని చంద్రబాబు కోరారు. దాంతో సభ సద్దమణిగింది.