కూలిన చారిత్రక ప్రసిద్ధ శ్రీకాళహస్తి రాజగోపురం
పదేళ్ల కిందటే ప్రమాద సంకేతాలు చిన్నచిన్న పగుళ్ల రూపంలో బయట పడ్డాయి. రెండు దశాబ్దాల కిందట గోపురానికి సమీపంలోనే శంకరముని కాంప్లెక్సును నిర్మించారు. అప్పట్లో పునాదులు తీసే సమయంలో గోపుర పునాదులు కదిలిపోయాయి. దీంతోపాటు 1984-86 మధ్య గోపురానికి సిమెంటు పూత వేయించే సమయంలో విచక్షణరహితంగా గుంతలు చేశారు. మెట్లు ఉన్నా కూడా సిమెంటు కాంక్రీటును పైకి తీసుకెళ్లేందుకు చేసిన గుంతలు గోపురం ఉత్తరం భాగాన్ని చాలా వరకు దెబ్బతీశాయి. ఆ తర్వాత కాలంలో పగుళ్లు మరింత పెద్దవి అవుతూ వచ్చాయి. ఆలయ అధికారులు వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇటీవలి తుపానుకు ముందు పట్టణంలో గోపురానికి అత్యంత సమీపంలో పిడుగు పడింది. భారీ వర్షాల కారణంగా పగుళ్లు ఇంకా పెరిగిపోయాయి. గోపురాన్ని పరిరక్షించుకోవడానికి చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణుల సహకారం తీసుకున్నారు. సోమవారం ఆ బృందం వచ్చి పరిశీలించింది. ప్రస్తుతానికి ప్రమాదం లేకున్నా ఎప్పటికైనా తప్పదని నిపుణులు హెచ్చరించారు. ఉత్తరం వైపు గోపురాన్ని మాత్రం నిలపడం కష్టమని పేర్కొన్నారు. గోపురం చుట్టూ 150 అడుగుల పరిధిని ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించి అక్కడున్న దుకాణాలన్నింటినీ ఖాళీ చేయించాలని సూచించింది. ఆలయ వర్గాలు ఆ దుకాణాలను వెంటనే ఖాళీ చేయించాయి. ప్రమాదజోన్గా గుర్తించిన పరిధి చుట్టూ కంచె వేశారు.