తోక ముడిచిన ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్, దేశం విడిచి పరారీ
30 ఏళ్లుగా తన పిడికిట్లో పెట్టుకున్న అధికారాన్ని సైన్యానికి అప్పగించి పలాయనం చిత్తగించాడు. 'సెప్టెంబర్ దాకా నేనే అధ్యక్షుడిని' అని గురువారం అర్ధరాత్రి హూంకరించిన ఈ 82 ఏళ్ల 'కురువృద్ధ అధ్యక్షుడు' శుక్రవారం అధ్యక్ష భవనాన్ని వదిలాడు. తన కుటుంబ సభ్యులతో సహా కైరో శివార్లలోని మిలిటరీ ఎయిర్బేస్కు చేరుకున్నాడు. ప్రత్యేక విమానం ఎక్కాడు. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఎర్ర సముద్రంలోని విహార స్థలం 'షర్మ్ ఎల్ షేక్' రిసార్ట్కు 'శాశ్వతం'గా టపా కట్టాడు. ఇన్నేళ్లు తనకు అండగా ఉన్న అమెరికాకు కూడా చెప్పకుండానే ముబారక్ ఈజిప్టును వదిలిపెట్టాడు. ఈ వార్తలను తొలుత సైన్యం కొట్టివేసింది. ఆ తర్వాత ఈజిప్టు ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రభుత్వ టెలివిజన్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తీపి కబురు చల్లగా చెప్పారు! 'ముబారక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధికారాన్ని సైన్యానికి అప్పగించారు' అని ప్రకటించారు. దీంతో 18 రోజులుగా ఉద్యమానికి వేదికగా మారిన కైరోలోని స్వేచ్ఛా చౌక్ విజయ గర్వంతో ఉప్పొంగి పోయింది. 'స్వేచ్ఛ లభించింది' అంటూ వేలమంది ఒక్కసారిగా చేసిన నినాదం ఆకాశాన్ని తాకింది.
ప్రజలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 'ఈజిప్టుకు స్వేచ్ఛ లభించింది. ఈ జీవితంలో ఇది అత్యంత ఆనందకరమైన రోజు' అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, విపక్ష నేత ఎల్ బరాదీ ఆనందంతో చెప్పారు. ఇక దేశంలో కొత్త పాలన మొదలవుతుందని సైన్యం ప్రకటించింది. ఉభయ సభలను రద్దు చేస్తామని తెలిపింది. మంత్రివర్గాన్ని సైతం రద్దు చేస్తామని తెలిపింది.