వైయస్ జగన్ సాక్షిపై టిడిపి అధినేత చంద్రబాబు నిప్పులు
వైయస్ నుండి లబ్ధి పొందిన వారే సాక్షిలో పెట్టుబడులు పెట్టారన్నారు. దీంతో పేదలకు చెందాల్సిన డబ్బు సాక్షిలోకి తరలిపోయిందన్నారు. కుప్పలు తెప్పలుగా సాక్షి కోసం బోగస్ కంపెనీలను సృష్టించారన్నారు. జగన్ సాక్షి అక్రమాల పుట్ట అని ఎవరో చెప్పింది కాదని, ప్రభుత్వ సంస్థ ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ స్వయంగా చెప్పిందే అన్నారు. ఇంత బాహాటంగా అవినీతికి పాల్పడినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుందన్నారు. వైయస్ అవినీతితో పేదల పొట్టలు కొట్టారన్నారు. మనీ లాండరింగ్తో షెల్ కంపెనీలు పుట్టించి పరిశ్రమను స్థాపించారన్నారు. వైయస్ కుటుంబం అవినీతిలో ఐటి చెప్పింది ఒక శాతం మాత్రమే అన్నారు. మాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదన్నారు. అయితే అవినీతిని మాత్రం సహించేది లేదన్నారు. అవినీతితో వైయస్ కుటుంబం సంపాదించుకున్న డబ్బును రికవరీ చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పాలన్నారు. డబ్బు రికవరీ చేయకపోవడం ప్రధాని, ముఖ్యమంత్రి చేతకానితనం కాదా అని ఆయన ప్రశ్నించారు.
2జి స్పెక్ట్రంపై జెపిసి ఎలా అయితే వేసారో, జగన్ అక్రమాలపై జెఎల్సీ వేయాలని డిమాండ్ చేశారు. వైయస్ ఉన్నప్పుడే రాజా ఆఫ్ కరెప్షన్ పేరుతో వైయస్ కుటుంబం అక్రమాలు టిడిపి అన్ని పార్టీలతో కలిపి విడుదల చేసిందన్నారు. వారి మైనింగ్ అక్రమాలపైనా పుస్తకం వేశామని చెప్పారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు వారి అవినీతి బయటకు వస్తుందని అన్నారు. వైయస్ అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్నారు. ఇష్టానుసారం ఎలా దోచుకుంటే దేశం ఏమై పోవాలన్నారు. జగన్ ఆస్తులపైన మళ్లీ సిబిఐ ఎంక్వయిరీ జరగాలన్నారు. అవినీతిపరులందరిపైనా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి చేయకుండా అడ్డుకోవాలన్నారు. అవినీతి చేయడానికి భయపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసే వరకు తెలుగుదేశం పోరాడుతుందన్నారు. అవినీతికి ఎంతటి స్థాయి వారు పాల్పడ్డా వదిలి పెట్టకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవినీతిపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న భారత్ అవినీతి వల్ల వెనక పడిపోతుందన్నారు.