సాదాసీదాగా రేపు ప్రధాని మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ
రేపు సాయంత్రం ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జీతో నలుగురు సహాయ మంత్రులు, ఆరుగురు సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న బేనీ ప్రసాద్ వర్మకు కేబినెట్ హోదా దక్కవచ్చు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను ఇండిపెండెంట్ చార్జీతో సహాయ మంత్రిగా తీసుకుంటారని అంటున్నారు. రైల్వే శాఖకు పూర్తి స్థాయి మంత్రిని ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి రైల్వే శాఖకు తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అదే పార్టీకి చెందిన దినేష్ త్రివేది రైల్వే శాఖను చేపట్టబోతున్నారు.
మంత్రివర్గం నుంచి ఇద్దరు డిఎంకె మంత్రులు తప్పుకున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఇరుక్కున్న ఎ రాజా, దయానిధి మారన్ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో డిఎంకె నుంచి మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సి ఉంది. దాని గురించి శనివారం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిఎంకె నేత కరుణానిధితో చర్చలు జరిపారు. అయితే, కరుణానిధి ఎవరి పేర్లను కూడా సూచించలేదని తెలుస్తోంది. దీంతో డిఎంకె నుంచి కొత్త మంత్రులు ఉండకపోవచ్చునని అంటున్నారు.