మహేష్, చెర్రీలు సహా పలువురికి సిబిఐ నోటీసులు
సినీ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ తేజలకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, మంజుల, భారతి రెడ్డి, మంత్రి జె. గీతా రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సహా పలువురికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిబిఐ మహేష్ బాబును ఆదేశించింది. కాగా, 15వ తేదీన హాజరు కావాలని చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజను ఆదేశించింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్లాట్ల మార్కెట్ ధర కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు ఉండగా, తక్కువ ధరకు ఎలా ప్లాట్లు, విల్లాలు పొందారనే విషయాన్ని పరిశీలించడానికి సిబిఐ వారందరికీ నోటీసులు జారీ చేసింది. ప్లాట్ల కొనుగోలుపై ఆర్థిక లావాదేవీల వివరాలను తెలపాలని సిబిఐ ఆదేశించింది. కొనుగోలుకు సంబంధించిన పత్రాలను తమకు చూపాలని కూడా సిబిఐ ఆదేశించింది. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రా రావు భార్యకు కూడా విల్లా ఉంది. ఆమెను కూడా సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు, ముంబై, కొల్కత్తా, ఢిల్లీలో ఉన్న దాదాపు 18 సంస్థలకు సిబిఐ నోటీసులు జారీ చేసింది.
ఈ కింది వారికి కూడా సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు వివిధ టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమయ్యాయి -
కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, చాముండేశ్వరీనాథ్, అంబటి మురళీకృష్ణ, కె. ప్రతాప రెడ్డి, శ్యాంప్రసాద్, కలిదిండి నీలిమ, కొప్పుల శ్రీనివాస్, కొనేరు విమలాదేవి, సునీల్ గోయంకా, సాయిబాబు, కాసు ప్రసాద్ రెడ్డి, శరత్ సూరి, డాక్డర్ సోమరాజు, వైయస్ చౌదరి, కె. అన్నపూర్ణ, బ్రహ్మారెడ్డి, రవిశ్వేత, పాటూరి రామారావు, తుమ్మల భానుమతి, జి. సంయుక్త, అనంత సేనా రెడ్డి, నంద్యాల శోభారాణి, పెన్నత్స విఎస్ రాజు, వేంకటేశ్వర రావు, చలసాని స్వప్న, పిఎస్ పార్థసారథి, శ్రీవాణి ముళ్లపూడి, లలిత్ కోడూరి, గల్లా పద్మావతి, తుమ్మల సచీంద్ర, కోనేరు సుధీర్, పి. కిరణ్ తదితరులు.