దాసరి తప్పించుకుంటున్నారు: కోల్ స్కామ్పై నామా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుని తింటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసి బొగ్గు కేటాయింపుల వ్యవహారంపై విచాణర జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సోమవారం నుంచి పార్లమెంటులో పోరాటం చేస్తూ ప్రధానిని నిలదీస్తామని ఆయన చెప్పారు.
బొగ్గు గనుల కేటాయింపులో భారీ యెత్తున అవకతవకలు జరిగిన విషయాన్ని సాక్ష్యాధారాలతో కాగ్ బయటపెట్టిందని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల వల్లనే ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని ఆయన అన్నారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న, కుంభకోణాల్లో ఇరుక్కున్న మంత్రులందరినీ పదవుల నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద రావు డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తే ప్రభుత్వం న్యాయ సహాయం అందించేందుకు ముందుకు రావడాన్ని ఆయన శనివారం గుంటూరు జిల్లా నర్సారావుపేటలో మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు.
లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలకు కూడా న్యాయసహాయం చేస్తారా అని ఆయన అడిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్కు ప్రధాన కోవర్టు అని ఆయన నిందించారు. అవినీతి మంత్రులను తొలగించకపోతే తమ పార్టీ పెద్ద యెత్తున ఆందోళనలకు దిగుతుందని ఆయన హెచ్చరించారు.