ఫెరా కేసు: శిక్ష రద్దు చేయాలని హైకోర్టుకు పార్థసారథి
మంత్రి తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభ రెడ్డి వాదించారు. మంత్రికి చెందిన కెపిఆర్ ప్లాస్టిక్స్(ప్రస్తుతం ఈ సంస్థ కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ లిమిటెడ్).. ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1994లో ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు. అప్పట్లో ఆ సంస్థ విదేశీ మెషినరీ కోసం రూ.69 లక్షలు చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని చెల్లించలేక దానిని దిగుమతి చేసుకోలేక పోయిందని, దీంతో ఈ డీల్ మధ్యలోనే నిలిచిపోయిందని వివరించారు.
ఇందులో ఎటువంటి అవినీతి, దురుద్దేశాలు లేవని తెలిపారు. వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక నేరాల కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలకు ఈడి న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కోర్టు తీర్పు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెస్తుందనే కారణంతో కొట్టివేయాలనడం సరికాదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.