శాన్వీ హత్య: శిక్షపై మాట మార్చిన రఘునందన్ తల్లి
తన కుమారుడు నేరానికి పాల్పడలేదని అమెరికాలోని 6 ఏబీసీ అనే చానల్కు చెప్పాడని, ఆ విషయాన్ని ఎందుకు ప్రసారం చేయట్లేదని, తన భర్త చనిపోయాక పిల్లల్ని చాలా క్ర మశిక్షణతో పెంచానని, నెలకు పదివేల డాలర్ల జీతం వచ్చే తన కుమారుడు ఐదు నెలల జీతం డబ్బు కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటాడా అని, అతడిని ముందుగా భారతదేశం తీసుకురావాలని, ఇక్కడి చట్టాల ప్రకారం విచారించి, తప్పు చేసినట్లు తేలితేనే శిక్షించాలని ఆదివారం రాత్రి టీవీ చానెళ్ల ప్రతినిధులను పిలిచి మరీ చెప్పారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో నివాసముంటున్న రఘునందన్ తల్లి పద్మావతి ఆదివారం నాడు రెండుసార్లుగా విలేకరులతో మాట్లాడారు.
చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే తన కుమారుడు సేవాగుణం కలిగినవాడని, పలువురికి సహాయం చేసేవాడని, అమెరికా నుంచి డబ్బు పంపించి పేదపిల్లలకు ఫీజులు చెల్లించి, పుస్తకాలు పంపిణీ చేయమనేవాడని పద్మావతి చెప్పారు. తన భర్త సురేంద్ర గతంలో పోలీసు శాఖలో పనిచేసేవారని, నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందారని చెప్పారు. విశాఖ పోలీస్క్వార్టర్స్లో 24 ఏళ్లపాటు ఉన్నామని, కానిస్టేబుల్ సురేంద్ర పిల్లలు ఎలాంటివారని అక్కడివారిని అడిగితే చెబుతారని ఆమె అన్నారు. అలాంటిది తన కుమారుడు హత్య చేసేంటంత క్రూరుడు, డబ్బు కోసం ఈ దురాగతానికి పాల్పడ్డాడని మీడియాలో కథనాలు వస్తుంటే నమ్మలేకపోతున్నాని అన్నారు.
అయితే ఈ నేరానికి పాల్పడినట్టు తన కుమారుడే అంగీకరించినందున అతనికి శిక్ష పడాల్సిందేనని పద్మావతి రోదిస్తూ చెప్పారు. శాన్వి తల్లితో తన కుమారుడికి సంబంధం ఉందనే ఆరోపణలు అవాస్తవమన్నారు. రఘు చిలకలూరిపేటలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సహ విద్యార్థిని కోమలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆమె ఆదివారం ఉదయం చెప్పారు.
ఆ తర్వాత ఆదివారం రాత్రి మరోసారి టీవీ చానళ్ల ప్రతినిధులను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. పొద్దున చెప్పిన విషయాలకు, రాత్రి చెప్పిన విషయాలకు పొంతన లేకుండా ఆమె మాట్లాడారు. సంఘటనపై తనకు ముందు సరైన సమాచారం లేదని, అందువల్లే తొలుత టీవీల్లో చూసినదాన్ని బట్టి అతడు హత్యచేసినట్లు భావించి, శిక్షించాలని చెప్పానని వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత దీనిపై మరింత సమాచారం కోసం అమెరికాలోని స్నేహితులను సంప్రదించి, ఇంటర్నెట్లో పలు న్యూస్ చానళ్లను పరిశీలించగా, ఈ నెల 26వ తేదీన రఘునందన్ను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తున్నప్పుడు 6ఏబీసీ చానల్ రిపోర్టర్ రఘునందన్ని ఉద్దేశించి, 'చిన్నారి పాపను ఎలా చంపావు?' అంటూ ప్రశ్నించగా, తను 'ఐ యామ్ నాట్ ద వన్'' (నేను అలాంటి వాడిని కాదు) అని స్పష్టంగా చెప్పాడని, ఇది నెట్లో ఉన్నదని ఆమె వివరించారు.
రఘునందన్ హత్య చేసినట్లు విస్తృతంగా ప్రచారం చేసిన ఎఫ్బీఐ పోలీసులు, ఈ నేరం చేయలేదని అతడే చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని, దాన్ని మీడియా ద్వారా ఎందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు. రఘునందన్కు నెలకు పదివేల డాలర్లకు పైగా జీతం వస్తుందని, ఐదు నెలలు పనిచేస్తే వచ్చే 50వేల డాలర్ల కోసం జీవితాన్ని నాశనం చేసుకునే ఇలాంటి పనిచేస్తాడని తాను భావించడం లేదన్నారు. దీని వెనుక వేరే ఏవో కారణాలు ఉండి ఉంటాయని ఆమె అనుమానం వ్యక్తంచేశారు.
ఎఫ్బీఐ పోలీసులు తన కుమారుడు ఏం చెప్పాడో కూడా ఇంతవరకు బయటకు వెల్లడించలేదని ఆమె ఆరోపించారు. తన కుమారుడు నేరస్థుడు కాదని అన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. రఘునందన్ను భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడి చట్టాల ప్రకారం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా అతను తప్పు చేసినట్టు తేలితే ఏ శిక్ష విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నందున పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని ఆమె కోరారు.