యుఎస్ కాల్పులు:28 మంది మృతి,20 మంది పిల్లలే
న్యూయార్క్: అమెరికాలో గన్ కల్చర్ మరోసారి బీభత్సం సృష్టించింది. కాల్పుల్లో అన్నెం పున్నెం ఎరుగని 28 మంది మరణించారు. మృతుల్లో 20 మంది పాపం పుణ్యం ప్రపంచమార్గం తెలియని చిన్నారులే. రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా ఓ 20 ఏళ్ల యువకుడు పాఠశాల తరగతి గదిలో కాల్పులు జరిపాడు. అతను పాఠశాల బయట ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. కొద్ది దూరంలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. వారిలో 26 మంది పాఠశాలకు చెందినవారు కాగా, మిగతా ఇద్దరు ఇతరులు.
కాల్పుల్లో పాఠశాల ప్రిన్సిపల్ కూడా చనిపోయినట్లు సమాచారం. న్యూయార్క్ నగరానికి 90 కిలోమీటర్ల దూరాన ఉన్న కనెక్టికట్లో ఈ దారుణం జరిగింది. కనెక్టికట్ న్యూటౌన్లోని శాండీ హుక్ ఎలిమెంటరీ పాఠశాలలబ శుక్రవారం ఉదయం సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో ఓ దుండగుడు బడి ఆవరణలో అడుగుపెట్టాడు. తూపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా చెలరేగిపోయాడు.
క్షణాల్లోనే అక్కడి వాతావరణం భయానకంగా మారిపోయింది. పిల్లలు, టీచర్లు, ఆ సమయానికి అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు. అసలేం జరుగుతోందో తెలసుకునేలోపే కొందరు బుల్లెట్లకు బలైపోయారు. బుల్లెట్ల దెబ్బకు కిటికీల అద్దాలు బద్దలైపోయాయి. చిన్నారుల రక్తంతో నేల తడిసిపోయింది. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు పాఠశాల వైపు పరుగులు తీశారు. తమ చిన్నారులను పొదివి పట్టుకుని, భయం భయంగా బడి నుంచి బయటికి వస్తున్న తల్లిదండ్రులు అనేకమంది కనిపించారు.
కనెక్టికట్ పాఠశాలలో కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించారు. అతను 24 ఏళ్ల రీయాన్ లాంజాగా గుర్తించారు. రెండో వ్యక్తి గుర్తింపు కోసం అతని తమ్ముడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన యువకుడి తల్లి నాన్సీ లాంజా పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. కాల్పుల్లో ఆమె కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు.
న్యూజెర్సీలోని నిందితుడి గర్ల్ ఫ్రెండ్, మరో మిత్రుడు అదృశ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. యువకుడు తల్లి కారులోనే కారులో పాఠశాలకు చేరుకున్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో మూడు గన్లు కనిపించినట్లు చెబుతున్నారు.