షర్మిల బర్త్ డే: కల్సిన వైయస్ వివేకానంద, పరామర్శ
ఈ రోజు షర్మిల పుట్టిన రోజు. వివేకానంద రెడ్డి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానుల షర్మిల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. షర్మిలకు ఆపరేషన్ డాక్టర్ సోమశేఖర రెడ్డి, రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని శోభా నాగిరెడ్డి చెప్పారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పారు.
5 జిల్లాలో 822 కిలోమీటర్లు
వాహనం పైనుండి కింద పడటంతో షర్మిల మోకాలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఆమెకు గురువారం కీహోల్ ఆపరేషన్ చేయనున్నారు. మూడు వారాల విశ్రాంతి అవసరమని అపోలో వైద్యులు చెప్పారు. దీంతో ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మూడు రోజులు బ్రేక్ రానుంది. ఇప్పటి వరకు షర్మిల నాలుగు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది.
రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా మోకాలికి గాయమైంది. దీంతో మొదట రెండు రోజులు విశ్రాంతి అవసరమని భావించారు. గాయం పెద్దదిగా తేలడంతో మూడు వారాల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. షర్మిల ఐదు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు 57 రోజులు పాదయాత్ర చేశారు. 822 కిలోమీటర్ల దూరం నడిచారు. 24 నియోజకవర్గాలలో పర్యటించారు. అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆమె పాదయాత్ర ప్రారంభమైంది.