హేట్ స్పీచ్: నిర్మల్కు అక్బరుద్దీన్, 36 కేసులు
హైదరాబాద్: ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మజ్లీస్ శానససభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు తరలిస్తున్నారు. అక్బరుద్దీన్ను ఆస్పత్రి వెలుపలికి తీసుకుని వచ్చి వాహనంలోకి ఎక్కించే సమయంలో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మజ్లీస్ కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల్లో అక్బరుద్దీన్ను న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారు. హైదరాబాద్ నుంచి నిర్మల్కు 235 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్కు అక్బర్ను తరలించే మార్గంలో భారీ భద్రతను, నిఘాను ఏర్పాటు చేశారు.
ఎనిమిది గంటల్లోగా అక్బరుద్దీన్ నిర్మల్కు చేరుకునే అవకాశం ఉంది. తూప్రాన్, మేడ్చెల్, అర్మూర్ మీదుగా ఆయనను నిర్మల్ తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలలోగా అక్బరుద్దీన్ నిర్మల్ చేరుకునే అవకాశం ఉంది. ఆరు వాహనాల కాన్వాయ్తో అక్బరుద్దీన్ను పోలీసులు నిర్మల్కు తరలిస్తున్నారు.
అక్బరుద్దీన్పై 121, 153(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిర్మల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ సోమవారం నుంచి 144వ సెక్షన్ విధించారు. అక్బరుద్దీన్ సోమవారంనాడే నిర్మల్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ, గడువు కోరుతూ ఆయన పోలీసులకు లేఖ పంపించారు. దీంతో నిర్మల్ పోలీసులు హైదరాబాద్ చేరుకుని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం సాధారణంగానే ఉందని ధ్రువీకరించుకుని అరెస్టు చేశారు.
గాందీ ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో ఉన్న అక్బరుద్దీన్కు అరెస్టు చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఐదుంబావు ప్రాంతంలో నిర్మల్ సిఐ రఘు చెప్పారు. దాంతో అక్బరుద్దీన్ ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. అక్బరుద్దీన్పై దేశవ్యాప్తంగా 36 కేసులున్నట్లు సమాచారం. హైదరాబాద్ పాతబస్తీలో పెద్ద యెత్తున టాస్క్ఫోర్స్ పోలీసులు మోహరించారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వరకు ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.
కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను నిర్మల్కు తరలించారు. నిర్మల్లో హైఅలర్ట్ ప్రకటించారు. నిర్మల్ రూరల్ పోలీసు స్టేషన్లో అక్బరుద్దీన్పై కేసు నమోదైంది. అక్బరుద్దీన్ను హైదరాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని అక్బరుద్దీన్ తరఫు న్యాయవాది షమీ డిమాండ్ చేశారు. వైద్య పరీక్షల నివేదిక తమకు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. పోలీసుల వైఖరి సరిగా లేదని ఆయన విమర్శించారు. ఈ రోజు అక్బర్ ఆహారం కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. అక్బర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన అన్నారు.
అక్బరుద్దీన్ను నిర్వహించిన పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో పోలీసులకు అందించామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ మహబూబ్ చెప్పారు. వివరాలను బయటకు వెల్లడించకూడదని తమకు పోలీసులు సూచించినట్లు ఆయన తెలిపారు.