నారాయణకు కెసిఆర్ కౌంటర్: ప్రధాని వ్యాఖ్యలపై వెనక్కి
15 పార్లమెంటు స్థానాల్లో తెరాస గెలిస్తే పార్లమెంటును గడగడలాడించ వచ్చునని, 100 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణపై తీర్మానాన్ని ఎవరూ అడ్డుకోలేరని కెసిఆర్ అన్నారు. ఎన్నికలలో తెరాస ఓడిపోతే తెలంగాణవాదం లేదని ప్రచారం చేస్తారని అన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా తెరాస నేతలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తమ తఢాకా ఏమిటో చూపిస్తామన్నారు.
హైదరాబాదుతో కూడిన తెలంగాణ కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లతోనే తెలంగాణకు సంబంధం ఉందన్నారు. దేశంలో ఏక పార్టీ పాలన పోయిందని చెప్పారు. పవార్ను తెలంగాణ గురించి అడిగితే బెస్ట్ అఫ్ లక్ అని చెప్పారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫ్యూన్కు తెలిసిన విషయం ఆయనకు తెలియదా అని మాత్రమే అన్నానని చెప్పారు.
పార్లమెంటులో ఎవరైనా కలిస్తే నమస్తే అంటే తాను మాత్రం జై తెలంగాణ అంటానని చెప్పారు. తెలంగాణ సాధనే మా ధ్యేయం, గమ్యం అన్నారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను స్తంబింప చేస్తామన్నారు. సీట్ల ద్వారానే తెలంగాణ వస్తుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, వరదారెడ్డిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మహమూద్ అలీ అని చెప్పారు.