బుజ్జగింపు: నేతలకు షాక్, దామోదర ఫోన్స్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు చిరంజీవి, పళ్లం రాజు, కావూరి సాంబశివ రావుల ద్వారా ఇప్పటికే విభజనపై సంకేతాలు సీమాంధ్ర నేతలకు అందాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలు చివరి వరకు పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే విభజనను అడ్డుకోవద్దంటూ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలకు ఫోన్లు చేశారు.
శుక్రవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన సీమాంధ్ర నేతలు, ఆ తర్వాత చిరు, కావూరి, పళ్లం రాజులను దూతలుగా పంపారు. వారికి కూడా ఢిల్లీ పెద్దలు విభజనపై నిర్ణయం తీసుకున్నామని తేల్చేశారని తెలుస్తోంది. దీంతో శనివారం సీమాంధ్ర నేతలు సోనియా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసేందుకు సిద్ధమయ్యారు. వీరికంటే ముందు చిరు, పళ్లం రాజు, కావూరిలు ప్రధానితో భేటీ అయ్యారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాము నమ్ముతున్నామని మంత్రి శైలజానాథ్ శనివారం అన్నారు. కావూరి నివాసంలో సీమాంధ్ర నేతలు భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము సోనియా, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సమైక్య బాధ్యతను కేంద్రమంత్రులకు అప్పగించామని చెప్పారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని, పార్టీ క్రమశిక్షణకు లోబడే వ్యవహరిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.
సీమాంధ్ర నేతల ప్రయత్నాలు
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేందుకు సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు మానలేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు. అయితే ముఖ్య నేతల నుండి విభజన సంకేతాలు అందడంతో వారిలో ఒకింత అందోళనతో కనిపిస్తున్నారంటున్నారు. వారు శనివారం కావూరి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
'చిరు' ప్రయత్నం
సీమాంధ్ర నేతలు చిరు ప్రయత్నంగా చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులను పంపినప్పటికీ ఢిల్లీ పెద్దలు విభజనపై ఓ నిర్ణయానికి వచ్చామని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే సీమాంధ్ర నేతలను బుజ్జగించాలని వారికి ఆజాద్, అహ్మద్ పటేల్లు సూచించారని తెలుస్తోంది.
నిర్ణయం అయిపోయింది!
విభజనపై నిర్ణయం అయిపోయిందని, ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదని దిగ్విజయ్, పటేల్, ఆజాద్లు సిఎం, పిసిసి చీఫ్, చిరు, పళ్లం రాజు, కావూరిలకు చెప్పారని అంటున్నారు. ఏదో ఒక పరిష్కారం చూపించాల్సిన సమయంలో ఇంకా జాప్యం చేయలేమని, ఎటూ తేల్చకుండా ఉండలేమని, ఇరు ప్రాంతాల నేతలు ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో మీరు పరిష్కారం చెప్పగలరా అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
దామోదర విజ్ఞప్తి
విభజనపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నదనే వార్తల నేపథ్యంలో సీమాంధ్రులకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ఫోన్ చేసి, విభజనను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారట. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి వంటి నేతలు కూడా తమ వంతుగా మంతనాలు సాగిస్తున్నారు.
అధిష్టానం మాటే....!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర మంత్రులు, పలువురు పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్రమంత్రులు మాత్రం అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని పలు సందర్భాలలో చెప్పారు. దీంతో కేంద్రమంత్రులు మంతనాలకు పరిమితమైనట్లుగా కనిపిస్తోంది.