రిజైన్ చేసేందుకే వెళ్లాం కానీ..: కేంద్రమంత్రుల యు టర్న్
డిగ్గీనికలిసిన అనంతరం పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, జెడి శీలంలు మాట్లాడారు. మంత్రివర్గంలో ఉంటేనే తమ వాదన వినిపించవచ్చునని చెప్పి రాజీనామా వద్దని చెప్పారని అన్నారు. అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, సీమాంధ్రుల అభిప్రాయాలను పరిశీలిస్తామని చెప్పారని, కష్టనష్టాలను అన్ని ప్రాంతాల వారు సమానంగా పంచుకోవాలని సూచించారన్నారు. రాజీనామా చేయాలనే ఉద్దేశ్యంతో కలిశామని, తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని అన్నారు.
విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తాము నిద్రాహారాలు మాని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాము తమ నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. రాజీనామాలకు సిద్ధపడే డిగ్గీని కలిశామని కానీ, ఆయన వారించారని చెప్పారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరినట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు.
కాగా, ఇప్పటికే ఏడుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయగా మరొకరు ఆ తర్వాత రాజీనామా చేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
ప్రకటనలు చేసి వెనక్కి వెళ్లడం అలవాటే
ప్రకటనలు చేసి వెనక్కి తగ్గడం కాంగ్రెసు పార్టీకి పరిపాటిగా మారిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం విమర్శించారు. ఈసారి వెనక్కి తగ్గకుంటేనే కాంగ్రెసును ప్రజలు నమ్ముతారన్నారు. వారం రోజుల్లోపే రాష్ట్రపతితో కూడా సంతకం చేయించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసు పార్టీ నేతలు ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. విభజన ప్రక్రియ త్వరగా ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు. విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మిగతా రాష్ట్ర డిమాండ్లను తెలంగాణతో పోల్చలేమన్నారు. 2009లోనే విభజన జరిగితే వందల మంది ప్రాణాలు పోకపోయి ఉండేవన్నారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజీనామాలకే మొగ్గు
ఇప్పటికే సమైక్యాంధ్ర కోసం పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. మరికొంతమంది సీమాంధ్ర నేతలు కూడా అదే దార్లో వెళ్లాలని భావిస్తున్నారు. ఈ రోజు హైదరాబాదులో మినిస్టర్స్ క్వార్టర్సులో పదిహేను మంది మంత్రులు, 26 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సాయంత్రం కలిసి రాజీనామా ఇవ్వాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారని సమాచారం.