CRDA కమిషనర్ ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు, రైతులు
రాజధాని పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలంటూ అమరావతి జేఏసీ నేతలు, రైతులు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 20 అంశాల్లో స్పష్టత కోసం కమిషనర్ ను కలిశామని, సీఆర్డీఏ పరిధిలో ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రహదారుల నిర్మాణాలు, సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేయాలని కోరామని, రైతుల సమస్యలతోపాటు ఇతర సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ నెలాఖరులోగా కౌలుకు సంబంధిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయం బయట నినాదాలు చేశారు.
అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చామని, అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులంటూ మా బతుకులతో చెలగాట మాడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసైన్డ్ భూములను పండించే రైతులకు వార్షిక కౌలు జమచేయాలని, అలాగే భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ ను వెంటనే చెల్లించాలని కోరారు.
వీటితోపాటు ప్రభుత్వ భవనాలను ఇతరుకు ఇవ్వొద్దని, భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఆర్డీఏ చట్టం అమలు చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతోందని, దీన్ని చట్టప్రకారం అమలుచేస్తే తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. నాలుగు నెలలకోసారి, ఐదు నెలలకోసారి కాకుండా ప్రతి నెలా భూమి లేని పేదలకు చెల్లించే పింఛను ఇవ్వాలని కోరారు.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఈ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం త్వరలోనే 1000వ రోజుకు చేరుకోబోతోంది. రాజధానిలో రోడ్లను తవ్వుకుంటూ పోయేవారిని అడ్డుకోవాలని, వారిని కట్టడి చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటనచేసే వరకు తమ ఉద్యమం విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.