ఏపిలో ఎన్నికల వరాలు: కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60కి పెంపు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పై క్యాబినెట్ సబ్ కమిటీ సానుకూల నిర్ణయాలను తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను ఎవరినీ తొలిగించేదీ లేదని..అదే విధంగా కొత్త వారిని తీసుకోబోమని తేల్చి చెప్పింది. ఇక..కాంట్రాక్టు ఉద్యోగుల వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచారు. కనీస వేతనాలు అమలు చేయాలని నిర్ణయించారు. దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఏపి ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. కాంట్రాక్టు పద్దతిన వైద్య -ఆరోగ్య శాఖ, ఉన్నత విద్యా శాఖ లోని విశ్వ విద్యాలయ..డిగ్రీ-జూనియర్ కాలేజీల్లో పని చేసే ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని ఏపి మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఉప సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు 180 రోజు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు.
అదే విధంగా..కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుండి 60 సంవత్సరాల కు పెంచాలని నిర్ణయించారు. అద్యాపకులకు ప్రస్తుతం ఇస్తున్న పది నెలల వేతనాన్ని 12 నెలలకు పెంచారు. తాజా గా తీసుకున్న నిర్ణయం కారణంగా..వైద్య -ఆరోగ్య శాఖలో 23,372 మందికి , ఉన్నత విద్యా శాఖలో 3,802 మందికి లబ్ది చేకూరుతుంది. వివిధ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించింది. మంత్రి వర్గ ఉప సంఘం చేసిన సూచనలను వచ్చే క్యాబినెట్ సమావేంలో ప్రభుత్వం ఆమోదిం చటం ద్వారా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.