ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...
ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
గవర్నర్ నిర్ణయంతో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కారుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి.
Recommended Video

రాజధాని బిల్లులు ఆమోదం..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించిన తర్వాత మండలి అభ్యంతరాలు తెలిపినా నెల రోజుల గడువు దాటిన తర్వాత ఈ బిల్లులు గవర్నర్ కు చేరాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనంటూ కేంద్రంలోని పెద్దలు కూడా పదేపదే చెప్పిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.

మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం...
మూడు రాజధానుల ఏర్పాటు కోసం గత డిసెంబర్ లోనే అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం జగన్ అనంతరం జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. వీటిలో అసెంబ్లీ మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేసినా శాసనమండలి మాత్రం ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. కానీ సెలక్ట్ కమిటీల ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఇవి కార్యరూపం దాల్చలేదు. ఆ లోపు విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనతో పాటు అమరావతి రైతులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది జూన్ లో మరోసారి ప్రభుత్వం ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. ఈసారి మండలి బిల్లులు ప్రవేశపెట్టేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో నెల రోజుల గడువు తర్వాత ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి వీటిని పంపింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

న్యాయపరమైన చిక్కులు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లులపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. వీటిపై విచాఱణ పలు దశల్లో ఉంది. తాజాగా హైకోర్టు విచారణ సమయంలోనూ గవర్నర్ బిల్లులను ఆమోదిస్తే తాము చూసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ అంతకు ముందే శాసనప్రక్రియ ద్వారా రాజధానుల ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి హైకోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు శాసన ప్రక్రియ ద్వారా బిల్లులకు ఆమోదం తెలపడంతో రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. అయితే శాసన ప్రక్రియ పూర్తయినందున ఇక ఈ కేసుల విషయంలో న్యాయస్ధానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications