మూడు రాజధానుల దిశగా..శరవేగంగా: కీలకంగా మారిన శ్రీలక్ష్మి: అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకు పైగా సాగుతోన్న అమరావతిపై జగన్ సర్కార్.. కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. అమరావతి ప్రాంత పరిధిలో స్తంభించిపోయిన ప్రాజెక్టులు, భవనాల నిర్మాణాల భవిష్యత్ను నిర్ధారించబోతోంది. భవన నిర్మాణాలను కొనసాగించాలా? లేదా? అనే విషయంపై తేల్చేయబోతోంది. దీన్ని ఖరారు చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వేర్వేరు శాఖలకు చెందిన తొమ్మిదిమంది ఉన్నతాధికారులను ఇందులో సభ్యులుగా చేర్చింది. దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది. ఈ జీవోలో.. అమరావతిని శాసన రాజధానిగా గుర్తించడం ఆసక్తికరంగా మారింది.

సీఎస్ అధ్యక్షతన..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఛైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో భూ పరిపాలన శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి, ఆర్థిక మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయ శాఖ కార్యదర్శి, అమరావతి మెట్రో రీజియన్ అభివృద్ధి అథారిటీ (ఏఎంఆర్డీఏ) కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి కమిటీ సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారును ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. అమరావతి ప్రాంత పరిధిలోని భవనాల పరిశీలన, వాటి యధార్థ స్థితిగతులు ఇతర వివరాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉంటుంది.

శ్రీలక్ష్మి కీలకంగా
ఈ కమిటీలో మున్సిపాలిటీల వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి.. కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏఎంఆర్డీఏ సహా.. అమరావతి మెట్రో పాలిటన వ్యవహారాల ఆమె శాఖ పరిధిలోకే వస్తాయి. రాజధాని పరిధిలో భవనాల వినియోగం, కరకట్ట రోడ్డు విస్తరణ, తదితర అంశాలపై ఆమె ఇదివరకే ఓ సర్వే చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించారు. కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధాని పరిధిలో నిలిచిపోయిన భవనాల సముదాయాలనూ పరిశీలించారు.

అమరావతి అభివృద్ధిపై ఇటీవలే సమీక్ష..
ఏఎంఆర్డీఏ పరిధిలో కొత్తగా చేపట్టిన, ఇప్పటికే కొనసాగుతోన్న ప్రాజెక్టులు, భవన సముదాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఓ సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఓ కమిటీని వేసి, భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటూ వెలువడిన అభిప్రాయాలకు అనుగుణంగా కమిటీ తెర మీదికి వచ్చిందని తెలుస్తోంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే స్తంభించిన ప్రాజెక్టులు, భవన సముదాయాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే వాదనలు ఉన్నాయి.

తప్పనిసరిగా అవసరమైన భవనాలు మాత్రమే..
అమరావతిని శాసన రాజధానిగా బదలాయించిన అనంతరం అక్కడ నెలకొనే డిమాండ్, జనాభా, నివాసం ఏర్పరచుకునే ఉద్యోగుల సంఖ్యను ఆధారంగా చేసుకుని.. తప్పనిసరిగా అవసరమైన భవన సముదాయాల నిర్మణాలను మాత్రమే కొనసాగించేలా జగన సర్కార్ నిర్ణయాలను తీసుకోవచ్చని అంటున్నారు. పూర్తిస్థాయి రాజధానిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కొన్ని భవనాల నిర్మాణాన్ని అక్కడితో ఆపివేసి, వాటిని ఇతర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. శాసన రాజధానికి తప్పనిసరిగా అవసరమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవడం, నిర్మాణం మధ్యలో ఉన్న భవనాలు హైకోర్టు, ఇతర కట్టడాలను పరిశీలించి ఓ సమగ్ర నివేదికను ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేస్తుంది.












Click it and Unblock the Notifications