జగన్ రెడ్డి ఇదేంది.. కేసీఆర్తో మాట్లాడండి... అంబులెన్సుల ఇష్యూపై లోకేశ్
కరోనా విజృంభిస్తోన్న వేళ తెలంగాణ- ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ నుంచి కరోనా సోకిన వారు తెలంగాణ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకోవడంతో దుమారం చెలరేగింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ సర్కార్ చేతగానితనం వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. ఎందుకు చొరవ తీసుకోవడం లేదని సీఎం జగన్ను లోకేశ్ అడిగారు.
రాష్ట్రంలో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకి ఎందుకు వెళతారని లోకేశ్ విమర్శించారు. ఇక్కడ ఉంటే ప్రాణాలు నిలవవు... అందుకోసమే వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ ఆ అవకాశం కూడా లేదు అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే ఆగమేఘాలపై హైదరాబాద్ వెళ్లి అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. అలాంటిది, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు హైదరాబాద్ వెళ్లే అవకాశం మాత్రం ఇప్పించలేరా? అని దుమ్ము దులిపారు.
ఇంత చేతగాని దద్దమ్మ సీఎం ఏ రాష్ట్రానికీ ఉండకూడదని లోకేశ్ అన్నారు.. తాడేపల్లి నివాసంలో ఎన్ని గంటలు నిద్రపోతారు కానీ, లేచి కేసీఆర్ గారికి ఫోన్ చేసి అనుమతులు తెప్పించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో పరిగణించి కరోనా రోగుల అంబులెన్సులను అనుమతించాలని లోకేశ్ హితవు పలికారు.
ఆరోగ్య పరిస్థితి విషమించిన వారు మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ వస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితుల అంబులెన్సులను ఆపకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. గోల్డెన్ అవర్స్ లోగా వారు ఆసుపత్రికి చేరగలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయని స్పష్టం చేశారు.