అమరావతిలో కీలక అడుగు: ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్కూల్...త్వరలో, వసతులు ఇలా
అమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషించడం ముదావహమని సాధారణ పరిపాలనశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ బుధవారం అన్నారు. మాలక్ష్మి గ్రూప్ నేతృత్వంలో అంతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధతో పాటు అయిదు నక్షత్రాల హోటల్ నవ్యాంధ్రలో ఏర్పడనుండటం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు.
మాలక్ష్మి తొలి భూమిపూజ
సీడ్ యాక్సిస్ రోడ్డులోని తిరుమల తిరుపతి దేవస్ధానముల నేతృత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బుధవారం వీటి నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పలు సంస్ధలకు భూములు కేటాయించినప్పటికీ మాలక్ష్మి తొలిగా భూమిపూజకు రావడం విశేషమన్నారు.
మాలక్ష్మి సామాజిక బాధ్యత ముదావహం
సామాజిక బాధ్యతను గుర్తెరిగి మాలక్ష్మీ, గ్లెండేల్ సంస్ధలు అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాయని, ఇది స్ఫూర్తిదాయకం అని ప్రత్యేక అతిథిగా హాజరైన పర్యాటక, భాషా, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. అమరావతి పరిధిలోని మూడు మండలాల్లో వంది మంది ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఉపకారవేతనాలుగా ఇవ్వాలని నిర్ణయించటం సంతోషకరమన్నారు.
కన్వెన్షన్ సెంటర్, వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్
మాలక్ష్మి వ్యవస్దాపకులు వై హరిశ్చంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో మాలక్ష్మి డబుల్ ట్రీ బై హిల్టన్ పేరిట అయిదు నక్షత్రాల హోటల్ రూపుదిద్దుకోనుందని నాలుగు ఎకరాల విస్గీర్ణంలో అత్యాధునిక హంగులతో మాలక్ష్మి డబుల్ ట్రీ అమరావతికే ప్రతిష్టాత్మకంగా అవతరించనుందని చెప్పారు. 2000 మంది ఏకకాలంలో వీక్షించగలిగేలా కన్వెన్షన్ సెంటర్, వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్, సర్వీస్ అపార్ట్మెంట్స్ సైతం ఈ నిర్మాణంలో అంతర్భాగంగా ఉంటాయని చెప్పారు. ఈ రంగంలో అగ్రగామి బ్రాండ్గా పేరు గాంచిన హిల్టన్ తమ భాగస్వామి అన్నారు.
అంతర్జాతీయ విద్య
ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మాలక్ష్యి గ్లెండేల్ పేరుతో అంతర్జాతీయ విద్యా సంస్థను నెలకొల్పుతామని సంస్థ సీఈవో సందీప్ మండవ తెలిపారు. రానున్న విద్యాసంవత్సరం నాటికే అమరావతివాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఇందుకు రూ.80 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. ఇక్కడ కేంబ్రిడ్జ్ సిలబస్ చిన్నారులకు బోధిస్తామని, విద్యార్ధి ఉపాద్యాయిల నిష్పత్తి పరంగానూ తాము నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నామన్నారు. సాధారణ బోర్డింగ్ విధానానికి భిన్నంగా చిన్నారులు తమ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేలా డే బోర్డింగ్, వీక్ బోర్డింగ్ వంటి సేవలను అందుబాటులో ఉంటాయన్నారు. డే బోర్డింగ్లో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తామని, వీక్ బోర్డింగ్ సోమవారం ఉదయం ప్రారంభమై శుక్రవారం సాయంత్రం ముగుస్తుందన్నారు. ఈ వెంచర్ల ద్వారా అద్బుత అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తమకు నిరంతర సహకారం అందిస్తూ అమరావతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమీషనర్ శ్రీధర్, ఇతర అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఙతలు తెలిపారు.