అమరావతి బకాయిలు ఇప్పించండి-సుప్రీంలో ఆ విదేశీ సంస్ధ పిటిషన్-ఏఎంఆర్డీఏకు నోటీసు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో అమరావతిలో పనులు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. అనంతరం హైకోర్టులో స్ధానిక రైతులుదాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగి అమరావతిలోనే పనులు చేపట్టాలని తీర్పు ఇవ్వడంతో తిరిగి పనులు మొదలయ్యాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో నార్మన్ ఫోస్టర్ సంస్ధ అమరావతికి ఇచ్చిన డిజైన్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు.
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు ఇచ్చిన సింగపూర్ సంస్ధ నార్మన్ ఫోస్టర్ కు బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం కానీ, ఏఎంఆర్డీఏ కానీ ఇప్పటివరకూ చెల్లించలేదు. నార్మన్ ఫోస్టర్ సంస్ధ ఎన్ని నోటీసులు జారీ చేసినా ఏఎంఆర్డీయే ఈ చెల్లింపులు చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు మధ్యవర్తిత్వం ద్వారా ఈ బకాయిలు ఇప్పించాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది.
అమరావతి డిజైన్ల వ్యవహారంలో నార్మన్ ఫోస్టర్ కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించని ఏఎంఆర్డీయేకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఏఎంఆర్డీఏ స్పందన కోరింది. నార్మన్ ఫోస్ట్టర్ చెబుతున్న విధంగా బకాయిలు చెల్లించాల్సి ఉందా లేదా అన్న దాని విషయంలో క్లారిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏఎంఆర్డీఏ ఇప్పుడు ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అమరావతిలో అభివృద్ధి పనులకే డబ్బులు లేవంటున్న జగన్ సర్కార్.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా నార్మన్ ఫోస్టర్ కు బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టుకు ఏం చెబుతుందో చూడాలి.