ఇవాళ అమరావతికి చంద్రబాబు- నేతల పరామర్శలు- పార్టీ భేటీలతో బిజీ షెడ్యూల్
కరోనా కల్లోలం రేపుతున్న వేళ సొంత రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి హైదరాబాద్లో ఉంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి రానున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతి రానున్న చంద్రబాబు పలు బిజీ కార్యక్రమాలతో గడపనున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు ఆయన్ను కలవబోతున్నారు.
ఆటవిక రాజ్యంగా ఏపీ- దళితులు, జర్నలిస్టులపై దాడులు- డీజీపీకి చంద్రబాబు లేఖ...
ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు.. కాస్త రిఫ్రెష్ అయిన తర్వాత విజయవాడ రానున్నారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర నివాసాలకు వెళ్లి చంద్రబాబు వారిని పరామర్శించనున్నారు. ఈఎస్ఐ స్కాం, మోకా భాస్కరరావు హత్య కేసుల్లో వీరిద్దరూ అరెస్ట్ అయ్యాక చంద్రబాబు వీరితో భేటీ కానుండటం ఇదే తొలిసారి. ఆయా కేసులు, తాజా పరిస్ధితి, కోర్టుల జోక్యం వంటి అంశాలపై వీరిని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
అనంతరం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీకి చెందిన సీనియర్ నేతలత భేటీ కానున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు, రాజధాని తరలింపు సహా పలు కీలక అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి అందుబాటులో ఉన్న సీనియర్ నేతలను ఆహ్వానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు తిరిగి తన నివాసానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళతారా లేక ఉండవల్లి నివాసంలోనే ఉండిపోతారా అన్న దానిపై క్లారిటీ రానుంది.