కబుర్లు ఆపు బుగ్గన.. ఆదాయం, మూలధన వ్యయం ఎంతో చెప్పు: పయ్యావుల కేశవ్
ఏపీ సర్కార్పై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి గురించి విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు కల్లబొల్లి కబుర్లు చెబుతారని మండిపడ్డారు. మీరు చెప్పే కథలను వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వి వాంట్ డేటా..
రాష్ట్ర ఆదాయం, మూలధన వ్యయం ఎంతో స్పష్టంగా చెప్పాలని కేశవ్ కోరారు. పథకాలకు పెడుతున్న ఖర్చు కన్నా.. వాటి ప్రచారం ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చులే ఎక్కువని ఆరోపించారు. ఇదీ పేపర్, టీవీలలో వచ్చే యాడ్ బట్టి అర్థం అవుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు డబ్బులు వెచ్చించాలే కానీ.. ప్రచారం కోసం చేయడం మంచిది కాదని సూచించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
పెట్టుబడులు లేవు
కొత్త పెట్టుబడులేవీ రాలేదని పయ్యావుల విమర్శించారు. అభివృద్దిలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టారని ఆయన విమర్శించారు. మరో తరం కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల్లాగా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు.
అప్పు ఇచ్చే పరిస్థితి లేదు..
ప్రభుత్వం అంటేనే విశ్వసనీయత అని.. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో మంచి పేరు ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకూ అప్పులిచ్చే పరిస్థితి లేదని అన్నారు. దీనిని బట్టి జగన్ సర్కార్ ఎలా పేరు సంపాదించిందో చూసుకోవచ్చని ఆయన అన్నారు. వచ్చిన కంపెనీలే వెనక్కి వెళ్లాయని గుర్తుచేశారు. ఉన్న భూములను, ఆస్తులను విక్రయించి.. కాలం వెళ్లదీయాలని జగన్ చూస్తున్నారని ఆరోపంచారు. కానీ సంపద సృష్టి గురించి మాత్రం ఆలోచించలేదని చెప్పారు. ఉన్న ఆస్తులను అమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.