రేషన్ దుకాణాల్లోనూ ప్లాస్టిక్ బియ్యమా?: జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక
అనంతపురం: వైసీపీ సర్కారుపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేషన్ బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయంటూ దుయ్యబట్టారు. తాడిపత్రి నందలపాడులోని అంగనివాడి సెంటర్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని తెలిపారు.
రేషన్ సరఫరా చేస్తున్న డీలర్పై కోర్టుకు వెళ్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పిల్లలు ప్లాస్టిక్ అన్నం తిని ఆస్పత్రిపాలైయితే, ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఓడి డబ్బులు సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడుతా అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, రెండ్రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ, నేతలపైనే సంచలన విమర్శలు చేశారు. జిల్లాలోని సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులతో పాటుగా మరో నేత కారణంగా పార్టీ జిల్లాలో నాశనం అవుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి పేర్లు పార్టీ సమావేశంలో బయట పెడతానని హెచ్చరించారు. సినిమా టిక్కెట్ల విషయం లో ప్రభుత్వం తమ నియంత్రణలోకి తెస్తూ నిర్ణయిస్తే అడిగే వాడే లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ పార్టీ నేతలు చేసేదే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అంటూ ఫైర్ అయ్యారు. ముందుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించాలని డిమాండ్ చేసారు. కొలువు లేని రాజకీయ నేతలు ఈ నీటి ప్రాజెక్టుల పేరుతో తిరుగుతూ ఉంటారని ఎద్దేవా చేసారు. లోకేశ్ పరామర్శలకు వెళితేనే లోపల వేస్తున్నారని.. వీరిని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ నేతలు ఎవరికి సమాచారం ఇచ్చారు... ఒక నేతనైనా పిలిచారా..నిజమైన కార్యకర్తలకు సమాచారం ఇచ్చారా అంటూ నిలదీసారు. టీడీపీకి బలమైన అనంతపురం జిల్లాలో కాల్వ శ్రీనివాసులుతో సహా.. మరో నేత కలిసి పార్టీని నాశనం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారెవరూ కార్యకర్తలను పట్టించుకున్న రోజు లేదంటూ మండిపడ్డారు. కార్యకర్తల సమావేశం నిర్వహించాలని జేసీ డిమాండ్ చేసారు.కార్యకర్తలను ఏ నేత సరిగ్గా చూసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తామంతా కార్యకర్తల వలనే నేతలమయ్యామని వివరించారు. అనంతపురం జిల్లాలోనే నేతలందరినీ మార్చాల్సిందేనని జేసీ డిమాండ్ చేసారు.
చంద్రబాబు మీరు గుర్తు పెట్టుకోండి...ఈ నేతల వలన జిల్లాలో పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదంటూ జేసీ తేల్చి చెప్పారు. ఈ నేతలకు ఏదీ చేతకాదని..అందరూ మాత్రం వారికి మద్దతుగా నిలబడాలంటారని చురకలు వేసారు. పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో ఏ అభ్యర్దికి అయినా ఈ నేతలు వచ్చి మద్దతుగా నిలబడ్డారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏ నేత కనిపించ లేదని చెప్పుకొచ్చారు.
కార్యకర్తలను పట్టించుకుంటనే మనుగడ సాధ్యమనేది గుర్తించాలని పార్టీ అధినేతకు జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. అంతేగాక, ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలుగు దేశం పార్టీ మళ్లీ ఓడిపోతుందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మటం లేదన్నారు. చంద్రబాబు మేలుకోకపోతే కష్టమన్నారు. చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.