ఏపీలో మరో 4 పోర్ట్ ల ఏర్పాటుకు సర్కార్ సిద్ధం: డీపీఆర్ లు,పర్యావరణ అనుమతులతో పనులు వేగం
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కొత్తగా మరో 4 ఓడరేవులు అందుబాటులోకి తీసుకురావటానికి క్యాబినెట్ లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించడానికి నిర్ణయం తీసుకోగా పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఈ పనుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక అంతే కాకుండా కాకినాడ సెజ్లో జీఎంఆర్ సంస్థ నిర్మించ తలపెట్టిన మరో ఓడరేవులో ఆదానీ గ్రూపుకు 49 శాతం వాటా విక్రయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం నాలుగు పోర్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి డీపీఆర్ లు
ఏపీలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని భావిస్తున్న సర్కార్ ,అటు పోర్టుల నిర్మాణంపైన కూడా దృష్టి పెట్టింది. తద్వారా సముద్రయాన వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయని భావిస్తుంది. ఇప్పటికే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి డీపీఆర్ లు రూపొందించింది. ‘రైట్స్' సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇచ్చిందని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, త్వరలో గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్లు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సర్కార్ ఓకే
ఇక ఈ పోర్టుల నిర్మాణానికి వస్తే రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రూ.10,009 కోట్లు అవసరమని రైట్స్ సంస్థ తన అంచనాలో పేర్కొంది . మొత్తం 16 బెర్తులతో 138.54 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ఓడరేవును మూడు దశల్లో నిర్మించనున్నారు. ఈ ఓడ రేవు నిర్మాణానికి 3,634.34 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వం చేతిలో 542 ఎకరాలు ఉన్నాయి. ఇంకా 3,093 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి డీపీఆర్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది .
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డీపీఆర్ పరిశీలన
ఇక మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి వస్తే 26 బెర్తులతో 253.20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ పోర్టు నిర్మాణానికి రూ.11,924 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు . గతంలో ఈ పోర్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థకు కేటాయించగా.. ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొని, భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఇంకా 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉందని తెలుస్తుంది. దీని డీపీఆర్ ను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు.
భావనపాడు పోర్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు అవసరమని అంచనా
ఇక భావనపాడు ఓడరేవు నిర్మాణానికి వస్తే ఐదు బెర్తులతో 31.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.3,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతంలో ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవగా ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఓడరేవును ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించడంతో తాజాగా డీపీఆర్ రూపొందించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అందుబాటులో ఉండేలా భావనపాడు ఓడరేవు నిర్మించనున్నారు.భావనపాడు పోర్టు నిర్మాణానికి కొత్తగా డీపీఆర్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Recommended Video
పోర్టుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు తీసుకుంటున్న సర్కార్
మచిలీపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు లభించాయని, రామాయపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసినట్లు కరికాల వలవన్ వెల్లడించారు. మొత్తానికి లోటు బడ్జెట్ రాష్ట్రం గా ఉన్నా సరే పోర్టులను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ఆ దిశగా ముందుకు వెళ్తుంది.