స్థానికులకే ఉద్యోగాలు ..ఏపీ సర్కార్ నిర్ణయం..జగన్ లాగే అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తే పరిస్థితి ఏంటి?
Recommended Video
స్థానికులకు ఉపాధి కల్పించే విషయంలో ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది . 75% ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో స్థానికత కే పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది . ఏపీ శాసన సభలో ప్రవేశపెట్టి చట్టం రూపొందించాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ సాధ్యాసాధ్యాలను ఆలోచించలేదు అనే భావన వ్యక్తం అవుతుంది. అయితే ఈ బిల్లు వల్ల స్థానికులకు తప్పనిసరిగా ఉద్యోగం ఇచ్చే విషయం అటుంచితే చాలా ఇబ్బందులు ఉన్నాయనే భావన వ్యక్తమవుతోంది.
జగన్ నిర్ణయం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం .. పరిశ్రమలు వెనక్కు పోయే చాన్స్
ఫెడరల్ స్ఫూర్తికి స్థానికులకే ఉద్యోగాలు బిల్లు పూర్తిగా విరుద్ధమని అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చట్టం అమలులో చాలా రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని ఇది పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగిస్తుందనే భావన వ్యక్తమవుతోంది.
జగన్ సర్కారు తీసుకునే నిర్ణయంతో ఏపీలో ఇక ఎవరు ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. దీనివల్ల నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుత విధానంలో దేశవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఎక్కడున్నా సరే వారిని తమ సంస్థల్లో చేర్చుకుని వారి సామర్ధ్యాన్ని ఉత్పాదనకు ఉపయోగించుకుంటున్నాయి కంపెనీలు. కానీ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అంటే.. ఈ 75 శాతం ఉద్యోగాలు ఇచ్చే యువతలో కనీసం సంస్థలో పని చేయడానికి కావలసిన క్వాలిటీస్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు . నైపుణ్యం ఉండాలి. అందరిలోనూ నైపుణ్యం ఉంటుందనేది మాత్రం అసలే చెప్పలేం. ఇక అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని నిబంధన పెడితే ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించరు అనే భావన వ్యక్తమవుతోంది.అసలు పరిశ్రమలే రాకపోతే.. ఉద్యోగాలెక్కడి నుంచి వస్తాయన్న వాదన తెరపైకి వస్తోంది. ఈ నిబంధన వల్ల ఏపీలో అసలు పరిశ్రమలే రావన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఏపీ సర్కార్ లా అన్ని రాష్ట్రాలు స్థానికులకే ఉద్యోగాలు అంటే తెలుగు వారి పరిస్థితి ఏంటి ?
75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే, ప్రతి రాష్ట్రంలోనూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న మన తెలుగు వారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాదు భారతదేశమంతా ఒకటి అన్న స్ఫూర్తి దెబ్బతింటుంది .
ఇక గతంలో వివిధ రాష్ట్రాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేశాయి. 2008లో మహారాష్ట్ర రాష్ట్ర సబ్సిడీల కోసం 80 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కానీ స్థానికులలో సదరు నిర్ణయానికి తగినట్లుగా నైపుణ్యం లేకపోవడంతో మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం విజయవంతం కాలేదు. ఇక ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం 2016లో 100% స్థానిక కోట ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే న్యాయ విభాగం దీనిని రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది.
75% స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే నిర్ణయంపై జాగ్రత్తగా అడుగెయ్యకుంటే రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారే ప్రమాదం
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటానికి , జీవించడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ ఈ తరహా నిర్ణయం వల్ల పౌరుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలుగుతుంది.
ఏ రాష్ట్రంలో అయిన పారిశ్రామిక ప్రగతి సాధించాలంటే స్నేహ పూర్వక పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయాలి. పరిశ్రమలకు కాస్త రాయితీలను కల్పించే ఆలోచన ప్రభుత్వాలు చేయాలి. అంతేకాదు నైపుణ్యం గల కార్మికులను ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. ఇక ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడే పారిశ్రామిక ప్రగతి సాధ్యమౌతుంది. స్థానికులనే తీసుకోవాలని నిబంధన పెడితే పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టాలంటే వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి అడుగు వెయ్యకుంటే అది ఏపీ రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టులా మారే ప్రమాదం ఉంది.